Errabelli Dayakar Rao: మంత్రి ఇలాకాలో 8 మందికి కరోనా పాజిటివ్, ఎర్రబెల్లి దయాకర్ రావుకి కరోనా నెగిటివ్, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి సూచన
Errabelli Dayakar Rao (Photo-Twitter)

Hyderabad, July 27: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ( Minister Errabelli Dayakar Rao) మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తన సిబ్బందిలో (Minister Errabelli’s staff) కొందరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. ముందస్తు జాగ్రత్తగా సోమవారం ఉదయం కరోనా టెస్టులు (Coronavirus Test) చేయించుకున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ఈ ఫలితాల్లో తనకు కరోనా నెగిటివ్‌ వచ్చిందని, తాను ముందుగా చెప్పినట్లే ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. కరోనా కేసుల్లో 'పొదుపు' పాటిస్తున్న తెలంగాణ, కొత్తగా మరో 1593 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 54 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య

ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పీఏతో పాటు ఇద్దరు గన్‌మెన్లు, ఒక కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఆయన వెంట ఉండే పీఏలు, గన్‌మెన్లు, సహాయకులకు ఈనెల 21న కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చినట్లు మంత్రి చెప్పారు. వీరందరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. వారికి పూర్తి కరోనా లక్షణాలు లేకపోవడంతో వైద్యులు అందరినీ వరంగల్‌ సమీప ప్రాంతంలో 14రోజుల పాటు హోం ఐసోలేషన్‌ క్వారంటైన్‌కు పంపించినట్లు మంత్రి పేర్కొన్నారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సోకిన వారి పట్ల మానవీయత చూపాలన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి, విధిగా మాస్కులు ధరించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణలోనే ఉందన్నారు. కరోనా బాధితులకు అవసరమైన మందులు, పరికరాలు, పరీక్షల కిట్లు, వైద్య నిర్వహణకు అవసరమైన ఇతర సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా కట్టడి అయ్యే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి దయాకర్‌కు చెప్పారు.