
Hyderabad, April 1: తెలంగాణలో ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా, మరోవైపు కరోనా వైరస్ తన తడఖా చూపిస్తుంది. రోజురోజుకి కేసులు పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ అధికారులతో వరుసగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. గురువారం, కోవిడ్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, నోడల్ అధికారులు మరియు ఇతర ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి మరింత విస్తరించకుండా కట్టడికి అవసరమయ్యే ఏర్పాట్లపై యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను మరింత వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి ఈటల, అవసరమయితే మునిసిపల్ మరియు పంచాయతీ రాజ్ సిబ్బంది సేవలు కూడా వాడుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. మరోవైపు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వచ్చినా మాస్కులు మరియు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని కోరుతున్నారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 59,297 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 887 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 1370 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,08,776కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 201 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 79 కేసులు,నిర్మల్ నుంచి 78, రంగారెడ్డి నుంచి 76, జగిత్యాల నుంచి 56 మరియు నిజామాబాద్ నుంచి 45 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,701కు పెరిగింది.
అలాగే బుధవారం సాయంత్రం వరకు మరో 337 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,01,564 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,511 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన పౌరులకు వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. అలాగే వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి, రెండో మోతాదు టీకాల పంపిణీ యధావిధిగా కొనసాగుతుంది.