Coronavirus Second Wave: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచన
Telangana CM KCR | File Photo

Hyd, Nov 23: దేశంలో మరోసారి కరోనావైరస్ విరుచుకుపడే అవకాశం ఉందని, తెలంగాణలో కూడా రెండవ దశ ప్రమాదం (coronavirus second wave) ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ఆదేశించారు. కోవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి (CM KCR) ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రజలు కూడా తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పెరుగుతున్నాయి. దీంతో పాటు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ వచ్చినా సరే తట్టుకునే విధంగా (Telangana fight coronavirus) తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయాలి’అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా, సెకండ్‌ వేవ్‌ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ప్రజలు తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడమే అసలైన మందు అని సూచించారు.పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 2.1 శాతం మాత్రమే ఉంది. రికవరీ రేటు 94.03 శాతం ఉంటున్నది.

జాతీయస్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషలో నిర్వహించాలి, ప్రధానికి లేఖ రాసిన తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగు విద్యార్థులు నష్టపోతున్నారంటూ లేఖలో ఆవేదన

కోవిడ్‌ వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా పదివేల బెడ్స్‌ ఆక్సిజన్‌ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఎన్నయినా సిద్ధం చేయగలం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది’అని సీఎం స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రిజ్వీ, మెడికల్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి, కోవిడ్‌ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్‌ పాల్గొన్నారు.