Ramagundam OCP Blast: రామగుండం సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో భారీ ప్రమాదం, నలుగురు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు, విద్యుత్‌ షాక్‌తో సిద్ధిపేటలో మరొకరు మృతి
Blast |Image used for representative purpose. (Photo Credits: IANS)

Hyderabad, June 2: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి దగ్గర గల రామగిరి మండలం ఓపెన్‌ కాస్ట్‌-1లో భారీ పేలుడు (Ramagundam OCP Blast) సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహాలక్ష్మి ఓబీ కంపెనీలో బ్లాస్టింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని సింగరేణి (Singareni Hospital) ఆసుపత్రికి అధికారులు మృతదేహాలను తరలించారు. తెలంగాణ ప్రజలకు ప్రధానితో పాటు పలువురు నేతల శుభాకాంక్షలు, ఆరేళ్ల తెలంగాణలో విజయాలు, సర్కారు విస్మరించిన అంశాలపై విశ్లేషణాత్మక కథనం

మృతుల్లో ఇద్దరు గోదావరిఖని(రాకేష్, ప్రవీణ్‌), ఒకరు కమాన్ పూర్‌(రాజేష్), మరొకరు రత్నాపూర్‌కు చెందినవారుగా గుర్తించారు. కమాన్‌పూర్‌కు చెందిన వెంకటేశ్, రత్నాపూర్‌కు చెందిన భీమయ్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కి గురై వ్యక్తి మృతి చెందారు.సిద్ధిపేట జిల్లాలోదౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ భర్త అశోక్‌ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటనలో అంగన్‌వాడీ ఆయా కలవ్వకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రంలో ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

దొమ్మట ఘటనపై స్పందించిన మంత్రి హరీష్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మృతుడి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయాన్నిప్రకటించిన మంత్రి.. అశోక్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కలవ్వను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.