Hyd, Jan 25: భాగ్య నగరంలో బాలికల దినోత్సవం రోజే దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలాపూర్లో 14 ఏళ్ల అమ్మాయిని అమ్మకానికి పెట్టారు. బాలికను ముంబైకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేందుకు కుటుంబసభ్యుల యత్నించారు. బాలికను విక్రయించేందుకు ( selling minor girl) రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. రూ.3లక్షలు ఇచ్చి బాలికను తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు బాలికను రక్షించారు. ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్తో పాటు మరో 8 మందిని (Nine Persons arrested in Hyderabad) అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ (61) ట్రావెలింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఆరేళ్ల కిందట భార్యకు విడాకులిచ్చిన ఇతడు మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 3 నెలల క్రితమే హైదరాబాద్లోని దళారులతో సంప్రదింపులు ప్రారంభించాడు. పెళ్లి కోసం అమ్మాయిని చూపించాలంటూ ఆటోడ్రైవర్ అయిన అఖిల్ అహ్మద్ను ఆశ్రయించాడు. ఇతడి ద్వారా జరీనా బేగం, షబానా బేగం రంగంలోకి దిగారు.. బండ్లగూడకు చెందిన బాలిక (14) తల్లి, అమ్మమ్మలతో దళారులు రాయబేరాలు ప్రారంభించారు.. రూ.5 లక్షలకు బాలికను విక్రయించేందుకు ఒప్పందం కుదిరినా.. వాటాల పంపిణీలో గొడవలు రావటంతో అల్తాఫ్ వెనక్కి వెళ్లిపోయాడు.
చివరికి రూ.3 లక్షలకు బాలికను కొనుగోలు చేసేందుకు ముంబై వ్యాపారి సిద్ధమయ్యాడు. సోమవారం సాయంత్రం రూ.3 లక్షలు తీసుకుని నిందితులు 9 మంది బాలాపూర్ మండలం ఎర్రకుంటలోని హబీబ్ ఫంక్షన్ హాల్ సమీపంలోని జరీనా బేగం ఇంటికి వచ్చారు. ఈ సమాచారంతో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదనపు సీపీ సుధీర్బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ పర్యవేక్షణలో బాలాపూర్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. బాలిక తల్లి, అమ్మమ్మతో సహా 9 మందిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వారి నుంచి 10 మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.