COVID in TS: తెలంగాణలో కొత్తగా 4,723 కోవిడ్ కేసులు నమోదు, 5 వేల మందికి పైగా రికవరీ; లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంక్ పనివేళల కుదింపు
COVID19 LOckdown Telangana. | File Photo

Hyderabad, May 12: సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేసులు కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేటి నుంచి అమలులోకి వచ్చింది.  రానున్న ఈ పది రోజుల్లో కేసులు ఎంతవరకు కట్టడి అవుతాయో చూడాలి.  ఈరోజు ఉదయం 10 గంటలు దాటాకా పోలీసులు ఎక్కడిక్కక్కడ మోహరించి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తొలిరోజు కావడంతో పోలీసులు కొంతమేర రిలాక్సేషన్ కల్పించినప్పటికీ గురువారం నుంచి లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుంటే ఎలాంటి ప్రయాణాలకు అనుమతించమని స్పష్టం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకునే వారు ఉన్న రాష్ట్రం నుంచి ఈ- పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇక, లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంక్ పనివేళల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. లాక్ డౌన్ ఉన్నంతకాలం ఇవే పనివేళలు అమలులో ఉండనున్నాయి. అలాగే 50 శాతం సిబ్బందితోనే బ్యాంకులు పనిచేయనున్నాయి.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. నిన్న రాత్రి 8 గంటల వరకు 69,525 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 4,723 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2,763 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,11,711కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 745 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 305 కేసులు, రంగారెడ్డి నుంచి 312  కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 31 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,834కు పెరిగింది.

అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 5,695 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,49,744 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.