Hyderabad, July 26: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి అదుపులోనే ఉంది, అయితే దీని తర్వాత థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నప్పటికీ దానిని సునాయాసంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ధీమా వ్యక్తం చేస్తుంది. కరోనావైరస్ యొక్క ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ రకానికి వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని అంతేకాకుండా తెలంగాణలో సుమారు 60 శాతం జనాభాకి సహజమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందినట్లు తాజా అధ్యయనం అంచనా వేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) యొక్క సెరో-నిఘా అధ్యయనం, రాష్ట్రంలో 60.1 శాతం జనాభా సహజంగా SARS-CoV-2 ను ఎదుర్కొనే యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు పరిశోధకలు తమ అధ్యయనంలో వెల్లడించారు. కాబట్టి థర్డ్ వేవ్ తీవ్రంగా ఉండకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,14,105 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 638 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1100 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,41,791కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 59 కేసులు నిర్ధారణ కాగా, వరంగల్ అర్బన్ నుంచి 66,
కరీంనగర్ నుంచి 65, ఖమ్మం జిల్లా నుంచి 62, మరియు పెద్దపల్లి జిల్లా నుంచి 45 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,787కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 715 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,28,679 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,325 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.