
Hyderabad, June 30: తెలంగాణలో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ దశల వారీగా కొనసాగుతోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి రెండు డోసుల మధ్య ఉండాల్సిన వ్యవధిని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఖరారు చేసింది. కోవిషీల్డ్ మొదటి డోస్ తీసుకున్నవారికి 14 నుంచి 16 వారాల మధ్య రెండో డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. జూలై 3 నుంచి ఇది అమలులోకి రాబోతుంది. అలాగే వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ లో ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ చేసుకున్న 18 ఏళ్ల పైబడిన వారికి జీహెచ్ఎంసీ పరిధిలో 100 వ్యాక్సిన్ కేంద్రాలలో టీకాల పంపిణీ ప్రారంభమవుతోందని అధికారులు వెల్లడించారు.
ఇక రాష్ట్రంలో సెకండ్ వేవ్ కోవిడ్ వ్యాప్తి అదుపులో ఉంది, రోజూవారీ కోవిడ్ కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,09,802 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 917 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1327 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,23,510కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 108 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 71, కరీంనగర్ నుంచి 66, మంచిర్యాల నుంచి 61 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 10 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,661కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 1,006 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,06,461 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,388 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.