TS Secretariat Vehicles Auction: తెలంగాణ సచివాలయం వాహనాలు వేలం, ఆగస్టు 20,21 తేదీల్లో వేలం కార్యక్రమం, లాట్లవారీగా బిడ్డింగ్‌, info@ bankauctions.inలో వాహనాల వివరాలు
Telangana CM K. Chandrashekhar Rao. | File Photo.

Hyderabad, August 13: తెలంగాణ సచివాలయంలో వినియోగంలోలేని వాహనాలను వేలంవేయాలని (TS Secretariat Vehicles Auction) కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగానికి పనికిరాని ఈ వాహనాలను సచివాలయ భవనాల కూల్చివేత సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్‌కు తరలించిన విషయం విదితమే. అయితే ఈ వాహనాలు వినియోగంలో లేకపోవడంతో వాటిని వేలం వేయాలని నిర్ణయించింది. వీటిని ఈ నెల 20,21 తేదీల్లో ఈ- వేలం ద్వారా విక్రయించనున్నది. ఈ మేరకు సచివాలయంలోని సాధారణ పరిపాలనశాఖ సమన్వయం చేయనున్నది. వాణిజ్య పన్నులశాఖ, అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, ఆర్టీఏ విభాగాలు సంయుక్తంగా టెండర్‌ పిలిచాయి.

18న సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో బిడ్లను స్వీకరిస్తారు. ఈ నెల12 నుంచి 16 వరకు ఉదయం11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వాహనాలను పరిశీలించే అవకాశం కల్పించారు. స్క్రాబ్‌ వెహికల్స్‌ 684 ఉండగా.. తిరిగి వినియోగించేందుకు వీలున్నవి 22 ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అనుగుణంగా ధరావత్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే స్క్రాప్‌ వాహనాలు 29 లాట్లల్లో ఉన్నాయి. లాట్లవారీగా బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. వాటిల్లో ఉన్న వాహనాల సంఖ్య ఆధారంగా వేలంలో పాల్గొనేవారు ధరావత్‌ చెల్లించాల్సి ఉంటుంది. వేలం ద్వారా విక్రయించే వాహనాల వివరాలన్నీ info@ bankauctions.inలో పొందుపరిచారు.