IND Vs AUS Tickets Stampede:హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదు, 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి, జింఖానా తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్
Telangana Minister Srinivas Goud (Photo-Twitter)

Hyd, Sep 22: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ (HCA) పూర్తిగా విఫలమైందని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (minister srinivas goud) మండిపడ్డారు.హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టికెట్ల అమ్మకం బాధ్యత హెచ్‌సీఏదేనని స్పష్టం చేశారు. HCA ప్రైవేట్ సంస్థ.. లా అండ్ ఆర్డర్‌కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కరోనా తర్వాత జరుగుతున్న మ్యాచ్ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు.సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్‌సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు.

జింఖానా ఘటనలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ వైఫల్యంపై పోలీసులు సీరియస్, హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశం

కాగా, ఆసీస్‌-భారత్‌ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట ( IND Vs AUS Tickets Stampede) జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి శేష్‌ నారాయణ్‌ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

కాగా భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసంఈరోజు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్యూ కట్టారు. టికెట్ల కోసం పెద్దఎత్తున క్రికెట్‌ అభిమానులు అక్కడికి తరలివచ్చారు. దీంతో అభిమానులను పోలీసులు నియంత్రించలేపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అలాగే పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది.