Special Vaccination Drive: జూన్ 3 నుంచి ఆర్టీసీ, ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్, రోజుకు 10 వేల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి అధికారుల ఏర్పాట్లు
COVID-19 Vaccine (Photo Credits: Twitter)

Hyderabad, June 1: కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వైరస్ సూపర్ స్ప్రెడర్లుగా భావించే హైరిస్క్ గ్రూప్ వారికి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా జూన్ 3, గురువారం నుంచి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వైరస్ వ్యాప్తికి అధిక ప్రమాదం పొంచి ఉన్న వారిని గుర్తించి, టీకాలు వేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో మంత్రి టి హరీష్‌రావు, సీఎస్ సోమేష్‌ కుమార్‌ సమావేశం నిర్వహించారు. దశల వారీగా ఒక్కో గ్రూప్ వారికి టీకాల పంపిణీ చేపడుతున్న నేపథ్యంలో నిరంతరం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే డ్రైవర్లకు వ్యాక్సినేషన్ మరియు వ్యాక్సిన్ లభ్యతపై సమీక్షించారు.

డ్రైవర్లుగా పనిచేసే వారందరికీ ఈ గురువారం నుంచి జీహెచ్‌ఎంసి మరియు రాష్ట్రంలోని ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలలో రోజుకు 10,000 మందికి టీకాలు వేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన వ్యాక్సిన్ కోటా, ఇప్పటివరకు అందిన వ్యాక్సిన్ అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ నిల్వలపై మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ డోసులను కేటాయించటానికి కేంద్రానితో సంప్రదింపులు జరపాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

చికిత్సకు అవసరమయ్యే వైద్య పరికరాలను సేకరించడం , ఆక్సిజన్ సరఫరా, స్టోరేజ్ యూనిట్ల ఏర్పాట్లు మరియు కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం మరియు నివారణ చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.  ఇదిలా ఉంటే, తెలంగాణలో కొత్తగా 2,524 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి, ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులను పొడగించింది. ఇక, ఇప్పటివరకు తెలంగాణలో అందరికీ కలిపి 60,58,833 డోసుల వ్యాక్సినేషన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ నివేదికలో వెల్లడించారు.