TRS Plenary Meeting Highlights: ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు వేల విజ్ఞాప‌న‌లు, ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, 9వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి
CM KCR atTRS Plenary Meeting (Photo-Video Grab)

Hyderabad, Oct 25: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏకగ్రీవంగా (CM KCR Unanimously Elected As TRS Party President ) ఎన్నికయ్యారు. పార్టీ ప్లీనరీ ఆయనను 9వ సారి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కేసీఆర్ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ కీలక నేత కేకే అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. మూడేళ్ల తర్వాత ప్లీనరీ (TRS Plenary Meeting) నిర్వహిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. అంతకుముందు సీఎం కేసీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తొలిసారి 2001లో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించామన్నారు. రకరకాల అపనమ్మకాల మధ్య గులాబి జెండా ఎగిరిందని.. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేక తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలను నిర్దేశించిందన్నారు. ఇది శాశ్వతంగా ఉండే కీర్తి అని కేసీఆర్ అన్నారు. వీఆర్‌ఓ వ్యవస్థకు బదులు ధరణి తీసుకొచ్చామని, రాష్ట్రంలో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నామన్నారు.

30 టన్నుల వరి ఉత్పత్తి చేసి రికార్డు సాధించామని, విద్యుత్‌ తలసరి వినియోగంలో నెం.1గా తెలంగాణ నిలవడం గర్వకారణమని తెలిపారు.11.5 ఆర్థిక వృద్ధితో దూసుకుపోతున్నామని, సాగునీటి రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చామని, అందరి సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి జరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడిల వెల్లువలా వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

రెండు దశాబ్దాల టీఆర్ఎస్, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాలు

అనేక అపనమ్మకాల మధ్య ఉద్యమానికి శ్రీకారం జరిగిందని, అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి అయినా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు కదిలామన్నారు. ఎక్కడ కూడా రాజీలేని పోరాటం చేయడం ద్వారానే తెలంగాణ‌ను సాధించుకున్నామ‌ని స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని కలాలకు మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముం‍దుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ ప‌థ‌కాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. దేశం కంటే తెలంగాణ రాష్ట్రం ముందుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ద‌ళిత బంధు ప్ర‌క‌టించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాప‌న‌లు వ‌చ్చాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామ‌ని చెబుతున్నారు. తెలంగాణ ప‌థ‌కాలు త‌మ‌కు కావాల‌ని ఆంధ్రా ప్ర‌జ‌లు కోరుతున్నారు. తెలంగాణ‌లో మంచి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయని, ఆ రాష్ట్రంలో మ‌మ్మ‌ల్ని కూడా క‌ల‌పాల‌ని కోరుతూ నాందేడ్, రాయ‌చూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వ‌చ్చాయి. ఉత్త‌రాది నుంచి వేల సంఖ్య‌లో కూలీలు వ‌చ్చి ప‌ని చేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్ర‌తిష్ఠ ఇనుమ‌డిస్తోంద‌న్నారు.

కేసుల‌తో అభివృద్ధిని అడ్డుకోవాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. పాల‌మూరులో పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేశామ‌న్నారు. సాహ‌సం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు. క‌ల‌లు క‌ని.. ఆ క‌ల‌ల‌నే శ్వాసిస్తే సాకార‌మ‌వుతాయి. తెలంగాణ‌లో అద్భుతంగా వ్య‌వ‌సాయ స్థీరీక‌ర‌ణ జ‌రిగింది. మ‌నం విడిపోయిన ఏపీ త‌ల‌సరి ఆదాయం రూ. 1.70 ల‌క్ష‌లే. తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం రూ. 2.35 ల‌క్ష‌ల‌కు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే క‌రెంట్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని కొందరు ఏపీ నేత‌లు అపోహ‌లు సృష్టించారు. కానీ తెలంగాణ‌లో 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం. ఆంధ్రాలో 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌మ‌వుతంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

నాడు తెలంగాణ స‌మాజం విశ్వాసం లేన‌టువంటి స్థితిలో ఉంది. ఈ స‌మాజం ఆ స్థితి నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని మాట్లాడుకున్నాం. దేశ స్వాతంత్ర్య పోరాటం మ‌హాత్మ‌గాంధీ ఆధ్వ‌ర్యంలో సాగింది. స్వాతంత్ర్య స‌మ‌ర‌బాట‌లో 287 సార్లు అనేక ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చి, వాటిని వాప‌స్ కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫ‌ల‌మైంది. జ‌లియ‌న్ వాలాబాగ్ మార‌ణ‌కాండ జ‌రిగింది. అయినా స్వాతంత్ర్య పోరాటం ఆగ‌లేదు. విజ‌యం సాధించింది. ఆ పంథాలోనే తెలంగాణ ఉద్య‌మం సాగింది. స్ప‌ష్ట‌మైన‌టువంటి మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగ‌డం జ‌రిగింది. మీలో చాలా మంది మొద‌టి రోజు నుంచి నేటి వ‌ర‌కు ప‌ని చేస్తూనే ఉన్నారు.

సిపాయిల తిరుగుబాటు విఫ‌ల‌మైంది అని అనుకుంటే దేశానికి వ‌చ్చేదా స్వాతంత్ర్యం.. రాజీలేని పోరాట‌మే విజ‌యం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ వ‌చ్చి తీరుతుందిని అని నిర్ణ‌యించుకున్నాం. అలా అనేక ర‌కాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. స‌మైక్య‌వాదులు అనేక అడ్డంకులు సృష్టించారు. చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. వేయ‌ని నింద‌లు లేవు. పెట్ట‌ని తిప్ప‌లు లేవు. ఎన్ని జేయాల్నో అన్ని చేశారు.

చివ‌రికి రాజ్య‌స‌భ‌లో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌నం కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వివ్లేషించుకుంటూ ముందుకు సాగినం కాబ‌ట్టి విజ‌య‌తీరాల‌కు చేరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్య‌మం ప్ర‌పంచ ఉద్య‌మాల‌కు కొత్త బాట‌ను చూపాయి. చ‌రిత్ర‌లో తెలంగాణ ఉద్య‌మానికి, ఉద్య‌మ‌కారుల‌కు శాశ్వ‌తంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.