TSPSC Paper Leak Case: ఓయూలో నేడు రేపు హై అలర్ట్, పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థి, పేపర్‌ లీకేజీ కేసులో 19 మందిని సాక్షులుగా చేర్చిన సిట్‌
TSPSC (Photo-Wikimedia Commons)

Hyd, Mar 24: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ అంశం తెలంగాణలో కాక రేపుతోంది.ఈ ఘటనపై ఉస్మానియా విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్‌ లీకేజీపై విద్యార్థులు జ్యూడిషియల్ విచారణకి పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకి ప్లాన్ చేశారు. ఓ వైపు దీక్షకి పర్మిషన్ లేదంటూ యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా.. మరో వైపు దీక్ష చేస్తే కేసులు తప్పవని ఓయూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా విద్యార్థి సంఘాలు మాత్రం తాము దీక్ష చేసి తీరుతామని స్పష్టం చేశాయి. క్యాంపస్‌లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘం చెప్పగా, వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం వారి రాకను స్వాగతిస్తున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తున్న క్రమంలో విద్యార్థులను ఓయూ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో క్యాంపస్‌లోకి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేసింది.

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, నిరుద్యోగ మహాదీక్షకు అనుమతి లేదన్న పోలీసులు, దీక్ష జరిగి తీరుతుందని స్పష్టం చేసిన ఓయూ విద్యార్థులు

విద్యార్థి నిరుద్యోగ మార్చ్‌ పేరుతో ర్యాలీకి పిలుపు ఇచ్చాయి విద్యార్థి సంఘాలు. అయితే.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఓయూ క్యాంపస్‌ గేట్లు మూసేశారు. అయినప్పటికీ దీక్షకు దిగేందుకు యత్నించారు విద్యార్థులు. దీంతో.. పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు యత్నించగా.. ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో నగేష్‌ అనే విద్యార్థి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు, పలువురి విద్యార్థులను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి, ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్‌లను సిట్‌ సాక్షులుగా చేర్చింది. సాక్షుల జాబితాలో చేర్చిన వారిలో కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌ స్క్వేర్‌ హోటల్‌ యజమాని, సిబ్బంది కూడా ఉన్నారు.

ఈ నెల 4న ఆర్ స్క్వేర్ హోటల్‌లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్‌లో ప్రశ్నాపత్రం చూసి ఇద్దరు నిందితులు ప్రిపేర్‌ అయ్యారు. ఆ తర్వాత నేరుగా పరీక్షా కేంద్రానికి నీలేష్, గోపాల్ వెళ్లారు. హోటల్‌లో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఏడు రోజుల కస్టడీకి సిట్‌ కోరింది.

రిమాండ్‌ రిపోర్టు ప్రకారం.. అరెస్టయిన వారిలో నలుగురు టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులు.. A1 ప్రవీణ్ TSPSC సెక్రెటరీ పీఏ, A2 నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్, A10 ASO షమీమ్, A12 డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 19 మంది సాక్షులను విచారించాం. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి శంకరలక్ష్మి ప్రధాన సాక్షి. ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, టీఎస్‌పీఎస్‌సీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులు, కర్మన్ ఘాట్‌లోని ఒక హోటల్‌లోని యాజమని, ఉద్యోగిని సాక్షి.

ఈ నెల 4వ తేదీన ఆర్ స్క్వేర్ హోటల్‌లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్‌లో రెండు గదులు (107,108) అద్దెకు తీసుకుని.. అక్కడే ప్రశ్నాపత్రం చూసి ప్రిపేర్ అయ్యారు. తర్వాత నీలేష్, గోపాల్ నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. హోటల్‌లోని సీసీటీవి ఫుటేజీలో పేపర్‌ ఎక్స్‌చేంజ్‌ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్‌లను అరెస్ట్‌ చేశాం. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్‌టాప్‌, మూడు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు పేపర్‌లీక్‌ కేసులో ఇటీవల అరెస్ట్‌ చేసిన ముగ్గురు నిందితులను సిట్‌ ఏడు రోజులపాటు కస్టడీకి కోరింది. షమీం, రమేష్, సురేష్‌లను సిట్‌ గురువారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.