
Hyderabad, January 22: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉంది, ప్రతిరోజు కేసులు నామమాత్రంగానే ఉంటున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నిన్న గురువారం రోజు 48,447 లబ్దిదారులకు టీకా పంపిణీ చేయాలని ఆరోగ్యశాఖ ప్రణాళిక వేయగా 27,682 మంది ఆరోగ్య సిబ్బంది టీకాలు తీసుకున్నారు. 57 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు టీకా అందుకున్న వారి సంఖ్య జనవరి 21 నాటికి 97,307గా ఉంది.
ఇక రాష్ట్రంలోని కొవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 28,791 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 214 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 472 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,92,835కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 38 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 14, మేడ్చల్ నుంచి 14, కరీంనగర్ నుంచి 14 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.


అలాగే గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,586కు పెరిగింది. అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 351 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 292,835 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,781 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.