ATM Withdrawal Alert: ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..అయితే ఈ పెరిగిన ఛార్జీలు గురించి ఓ సారి తెలుసుకోండి, లేకుంటే వసూళ్ల బాదుడు తప్పదు
ATM Machine | Image Used for Representational Purpose Only | (Photo Credits: Money Control.com)

వచ్చే ఏడాది నుంచి ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. జనవరి 1, 2022 నుంచి పరిమిత ఏటీఎం విత్‌డ్రాలు (ATM Withdrawal Alert) దాటితే ఛార్జీలు వఃూలు చేయనున్నాయి. ఇది ఇంతకు ముందు చెప్పిందానికంటే ఎక్కువే ఉండొచ్చని ఆర్బీఐ (RBI) మరోసారి సంకేతాలు ఇచ్చింది. క్యాష్‌, నాన్‌-క్యాష్‌ ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ ఇటీవలే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే బ్యాంకులు తమ ఖాతాదారులను ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాయి. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ , బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్‌జాక్షన్స్‌, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్‌-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు (ATM Cash Withdrawals ) అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్‌జాక్షన్‌కు రూ.21 చొప్పున బ్యాంకులు వసూలు చేస్తాయి .

అయితే ఏటీఎం ఛార్జీల పెంపుపై విమర్శలు వస్తుండడంతో ఆర్బీఐ తన నొటిఫికేషన్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. DPSS.CO.PD.No.316/02.10.002/2014-2015 dated August 14, 2014 సర్క్యులర్‌ ప్రకారం.. ఉచిత ట్రాన్‌జాక్షన్స్‌ ముగిశాక సెయిలింగ్‌/క్యాప్‌ ప్రకారం.. కస్టమర్ల నుంచి 20రూ. వసూలు చేసుకునే వెసులుబాటు బ్యాంకులకు ఉంది. అయితే బ్యాంకుల మీద పడుతున్న హయ్యర్‌ ఇంటర్‌చేంజ్ రుసుమును భర్తీ చేయడానికి, పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లు బ్యాంకులకు సాధారణ వృద్ధి అందించడానికి 21.రూ.లకు సవరించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ ఛార్జీతో పాటు అదనంగా బ్యాంకులు ట్యాక్సులు వసూలు చేస్తాయి.

వాట్సాప్ ద్వారా ఉబెర్ క్యాబ్ బుకింగ్ ఇలా చేసుకోండి, ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో ఊబెర్ కొత్త ఫీచర్, ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా లక్నోలో అమలు

ఏటీఏం ఛార్జీల మొత్తం స్వరూపాన్ని సమీక్షించడానికి ఆర్బీఐ జూన్ 2019లో అప్పటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజి కన్నన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫారసులను జూలై 2020లో వెల్లడించింది. దీంతో సిఫారుసులపై సమీక్ష అనంతరం ఆర్బీఐ.. పెంపునకు అంగీకరిస్తూ ఒక నొటిఫికేషన్‌ జూన్‌ 10, 2021నే విడుదల చేసింది. క్యాష్ రీసైక్లర్ మెషిన్‌లో జరిగే లావాదేవీలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ).

కొత్త ఛార్జీల ప్రకారం.. 21రూ. + జీఎస్టీ పేరుతో ఇప్పటికే వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేశాయి హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకులు. విత్‌డ్రా లిమిట్‌ను అనుసరించి హెడ్‌డీఎఫ్‌సీ తన సొంత ఏటీఎంలలో ఐదు క్యాష్‌ విత్‌ డ్రా ట్రాన్‌జాక్షన్లకు ఉచితంగా అనుమతిస్తుండగా.. ఆ పరిధి దాటితే వసూలు చేయనుంది. అయితే బ్యాలెన్స్‌ ఎంక్వయిరీ,మినీ స్టేట్‌మెంట్‌, పిన్‌ ఛేంజ్‌ సర్వీసులను మాత్రం పరిమితులు లేకుండా ఫ్రీగా అందించనున్నట్లు తెలుస్తోంది. కానీ, నాన్‌-హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో మాత్రం ఎలాంటి సేవల్ని వినియోగించుకున్నా(ఫ్రీ ట్రాన్‌జాక్షన్స్‌ ముగిశాక) ఛార్జీలు వసూలు చేయనుంది.