PUBG Ban: టెన్సెంట్ గేమ్స్ తో సంబంధాలను తెంచుకున్న పబ్‌జీ కార్పొరేషన్, భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పబ్‌జీ మొబైల్ గేమ్ ఉంటుందని వెల్లడి
PUBG | Image used for representational purpose only | (Photo Credits: Flickr)

New Delhi, Sep 8: కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ (PUBG Ban) మొబైల్ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంతో పాటు దేశంలో డేటా భద్రత కోసం భారత ప్రభుత్వం చైనా యాప్స్ ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక పబ్‌జీలో బాగా పాపులర్ అయిన బ్యాటిల్ రాయల్ గేమ్ అనేది సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ. అయితే పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ (Tencent Games) ప్రమోట్ చేస్తోంది. ఇక ఇండియాలో పబ్‌జీ మొబైల్ వర్షన్ రిలీజ్ చేసింది కూడా టెన్సెంట్ గేమ్స్ కంపెనీనే.

ఈ నేపథ్యంలో చైనా యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధిస్తుండటంతో టెన్సెంట్ గేమ్స్ మేనేజ్ చేస్తున్న పబ్‌జీ మొబైల్ (PUBG MOBILE) పైనా బ్యాన్ పడింది. దీంతో సౌత్ కొరియాకు చెందిన పబ్‌జీ కార్పొరేషన్ (PUBG Corporation) ఈ అంశంపై స్పందించింది. మొత్తం పరిస్థితిని గమనిస్తున్నామని, నిషేధం గురించి తమకు సమాచారం ఉందని, అయితే ఇకపై పబ్‌జీ మొబైల్‌కు, టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, పూర్తి బాధ్యతల్ని పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.

పబ్జీ ఇండియా నుంచి అవుట్, భద్రతా కారణాలతో పబ్జీ గేమ్‌తో సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం, పబ్‌జీకి ఇండియాలో 50 మిలియన్ల మందికి పైగా యూజర్లు

భారత ప్రభుత్వానికి చెందిన ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలను పబ్‌జీ కార్పొరేషన్ పూర్తిగా అర్థం చేసుకుందని ప్లేయర్ల డేటాను సురక్షితంగా ఉంచడం మా కంపెనీ మొదటి ప్రాధాన్యమని ప్రకటనలో తెలిపింది. ఈ గేమ్‌ను ప్లేయర్స్‌కు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పబ్‌జీ మొబైల్ గేమ్ ఉంటుందని తెలిపింది.

దీని ప్రకారం పబ్‌జీ మొబైల్‌ యాప్‍ను చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ నిర్వహించదు. పబ్‌జీ మొబైల్ వర్షన్‌ని కూడా పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఇక పబ్‌జీ మొబైల్‌ యాప్‌కు చైనా మూలాలు ఉండవు కాబట్టి త్వరలో ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం తొలగిపోతుందని పబ్‌జీ కార్పొరేషన్ భావిస్తోంది. పబ్‌జీ మొబైల్‌ యాప్‍ను బ్యాన్ చేయడంతో టెన్సెంట్ మొబైల్‌కు 34 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని సమాచారం.