Earthquake: చిలీ తీర ప్రాంతంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు ఏమి లేవు, రిక్టర్ స్కేలుపై 7.2 భూకంప తీవ్రత నమోదు
Earthquake shake the several parts of the world | Representational Image | Photo- Pixabay

Chile, September 30:  చిలీ తీరంలో ఆదివారం రోజు 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) వెల్లడించింది. టాల్కా నగరానికి పశ్చిమాన 134 కిలోమీటర్ల రూరంలో, సుమారు 9.8 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు ఇప్పటివరకు జారీచేయబడలేదని USGS స్పష్టం చేసింది.

పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" లో ఉన్న చిలీకి ఘోరమైన భూకంపాల చరిత్ర ఉంది, దక్షిణ-మధ్య తీరంలో  2010 లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 535 మంది ప్రాణాలు విడిచారు. ఆనాడు రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో వచ్చిన బలమైన ప్రకంపనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 53 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.  చాలా చోట్ల తీరప్రాంత పట్టణాలు భారీ నష్టాలను చవిచూశాయి.

చిలీ భూప్రకంపనలకు సంబంధించిన తాజా దృశ్యం:

గత వారం సెప్టెంబర్ 26న ఇండోనేసియాలోని, దావావో నగరంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీని కారణంగా కనీసం 30 మంది మరణించగా,  మరో 135 మంది గాయపడినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి, తాజాగా నిన్న్ ఆదివారం (సెప్టెంబర్ 29)న కూడా మరోసారి దావావో నగరంలో 6.1 తీవ్రతతో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఫిలిప్పైన్స్ దీవుల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తుంది.

ఇండోనేసియా భూప్రకంపనలకు సంబంధించిన తాజా దృశ్యం: 

గత 10రోజుల వ్యవధిలో భూమిపై చాలా చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల సెప్టెంబర్ 23న పాకిస్థాన్ కేంద్రంగా 6.3 తీవ్రతతో నమోదైన భూకంపం కారణంగా పాకిస్థాన్ లోని మీర్పూర్ మరియు POKలో రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భూకంపంలో తాజా లెక్కల ప్రకారం, మిర్పూర్ జిల్లాలో 135 ఇండ్లు, భవనాలు కూలిపోగా, 319 భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య 40కి పెరగగా, గాయపడిన వారి సంఖ్య 850కి పెరిగింది. ఈ భూకంపం కారణంగా ఉత్తర భారత దేశంలోని ఢిల్లీ, పంజాబ్, మరియు జమ్మూకాశ్మీర్ లలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.