COVID-19 Outbreak: ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్-19, 3 వేలు దాటిన కరోనావైరస్ మృతుల సంఖ్య, సుమారు 90 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య
Image Used For Representative Purpose Only. | File Photo

New Delhi, March 2:  కొవిడ్ 19 లేదా కరోనావైరస్ ( Coronavirus outbreak)  ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తి ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 3,000 దాటింది. ఇక ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య (COVID 19 Death Toll) ఇప్పటివరకు 89,000కు చేరుకుంది. చైనాలో ఆదివారం ఒక్కరోజే ఈ వైరస్ ప్రభావంతో మరో 42 మంది చనిపోయారు. దీంతో చైనాలో (China) కరోనావైరస్ మరణాలు 2,912 కు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా మార్చి 02న కొత్తగా 202 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా సోమవారం ప్రకటించింది. అయితే గతంలో కంటే రోజురోజుకి కేసులు తగ్గుతున్నాయని అధికారులు వెల్లడించారు.

అయితే COVID-19 కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుండగా, చైనాలో మాత్రం కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మధ్య చైనాలోని హుబీ ప్రావిన్సులో ఉద్భవించిన ఈ వైరస్ ఇప్పుడు అంటార్కిటికా ఖండం మినహా ప్రపంచంలోని అన్ని ఖండాలకు పాకింది. సుమారు 60 దేశాలలో కోవిడ్ ప్రభావం ఉంది.

చైనా తర్వాత దక్షిణ కొరియాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ద.కొరియాలో నమోదైన COVID-19 కేసుల సంఖ్య 4000 దాటింది. ఐరోపా ఖండంలోని ఇటలీ దేశంలో కరోనావైరస్ మరణాల సంఖ్య 34కు చేరగా, కేసుల సంఖ్య 1,577కు చేరింది.  చికెన్ ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందని పుకార్లు, నిర్భయంగా తినండంటూ చికెన్ లెగ్ పీసులు తింటూ చాటిన తెలంగాణ మంత్రులు

ఇదిలా ఉండగా 60 ఏళ్లు పైబడి, రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వారిపైనే కోవిడ్ 19 ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (The World Health Organisation) వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన బాధితుల్లో చాలా మందికి తేలికపాటి వ్యాధి లక్షణాలను మాత్రమే అనుభవిస్తారు, అయితే అందులో 14 శాతం మంది మాత్రమే న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారని WHO తెలిపింది. కరోనావైరస్ సోకిన రోగుల మరణాల రేటు కేవలం 2 నుంచి 5 శాతం మధ్య ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. ఇది గతంలో వ్యాప్తి చెందిన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) మరణాల రేటు 34.5 శాతం మరియు సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) వంటి వైరస్ మరణాల రేటు 9.5 శాతం కంటే తీవ్రత తక్కువగా ఉందని WHO గుర్తించింది.