Coronavirus in India: మనిషికి తెలియకుండానే కరోనా వచ్చి..వెళుతోంది, ఏపీలో సీరో సర్వైలెన్స్‌ పరీక్షలో ఆసక్తికర నిజాలు, దేశంలో తాజాగా 55,079 మందికి కరోనా, 27 లక్షలు దాటిన కోవిడ్ కేసులు
Coronavirus in India | (Photo Credits: PTI)

New Delhi, August 18: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 55,079 కరోనా పాజిటివ్‌ కేసులు (India’s Coronavirus) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,02,743 కు (COVID-19 Tally) చేరింది. తాజాగా 876 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య సంఖ్య 51,797 కు (Covid Deaths) చేరింది. ఇప్పటి వరకు 19,77,780 వైరస్‌ నుంచి కోలుకున్నారు. 6,73,166 బాధితులు ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.దేశంలో సోమవారం 8,99,864 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు 3,09,41,264 మందికి కరోనా పరీక్షలు చేసిందని ఐసీఎంఆర్‌ వివరించింది.

ఇప్పటివరకు 3 కోట్ల మందికిపైగా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఆగస్టు 16 నాటికి మొత్తంగా 3 కోట్ల 41 లక్షల 400 పరీక్షలు నిర్వహించి నట్టుగా తెలిపింది. జూలై 6 నాటికి కోటి పరీక్షలను పూర్తి చేస్తే, ఆగస్టు 2 నాటికి 2 కోట్లు పూర్తయ్యాయి. మరో రెండు వారాల్లో రికార్డు స్థాయిలో మరో కోటి పరీక్షలు పూర్తి చేశారు. ఇక ఆదివారం నుంచి సోమవారం మధ్య దేశంలో తాజాగా 57,981 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 26,47,663కి చేరుకుంది. 24 గంటల్లో మరో 941 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.92శాతానికి తగ్గింది. రష్యా వ్యాక్సిన్‌పై షాకింగ్ న్యూస్, ఆ టీకా వేసుకునేందుకు నిరాకరిస్తున్న రష్యన్ డాక్టర్లు, సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన ఆర్‌బీసీ న్యూస్‌

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,043 మంది ఖైదీలు, 302 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 818 మంది ఖైదీలు, 271 మంది సిబ్బంది కోలుకున్నారని జైళ్లశాఖ విభాగం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి మొత్తం 10,480 మంది ఖైదీలను విడుదల చేశారు. 2,444 మంది పెరోల్‌పై విడుదల చేయగా మిగిలిన వారిని హై పవర్ కమిటీ సిఫారసుల మేరకు బెయిల్‌పై విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో సోమవారం కొత్తగా 8,493 కరోనా కేసులు నమెదు కాగా 228 మృతి చెందారు. ఇప్పటివరకు 6,04,358 మంది వైరస్‌ బారినపడగా 4,28,514 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారని, 1,55,268 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 20,265 మంది మృతి చెందారని పేర్కొంది

ఏపీలో సీరో సర్వైలెన్స్‌ పరీక్షల నిర్వహణకు ఐసీఎంఆర్‌ ఆదేశాలు

కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఏపీలో సీరో సర్వైలెన్స్‌ పరీక్షల నిర్వహణకు ఐసీఎంఆర్‌ ఆదేశాలు ఇచ్చింది వీటి ప్రకారం ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో సీరో సర్వైలెన్స్‌ పరీక్షలను పైలట్‌ ప్రాజెక్టుగా నిర్వహించారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పరీక్షలు చేపట్టారు. ర్యాండమ్‌ విధానంలో ఎంపిక చేసిన వారిని పరీక్షించారు. వీరి శరీరంలో యాంటీబాడీల శాతం ఎంత మేర ఉంది, కరోనా సోకిన వారు ఎందరు, కోలుకున్న వారు ఎందరు అనే విషయాలు వీటిలో పరీక్షించారు.

కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ సీరో సర్వైలెన్స్‌ పరీక్షల ఫలితాలను తాజాగా ప్రభుత్వం వెల్లడించింది.తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో ఒక్కో చోట దాదాపు 4 వేల శాంపిళ్లను సేకరించింది. అర్బన్‌లో 30 శాతం, రూరల్‌లో 70 శాతం మందిని పరీక్షించారు. అదీ స్ధానికంగా కరోనా వచ్చిన వారు, పురుషులు, మహిళలు ఇలా వర్గీకరించి మరీ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహించిన ఈ సీరో సర్వైలెన్స్‌ పరీక్షల ఫలితాల్లో అత్యధికంగా కృష్ణాజిల్లాలో 20 శాతం మందికి కరోనా వైరస్‌ వచ్చిందని, పోయిందని నిర్ధారణ అయింది.

ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో 15 శాతం మందికీ ఇదే విధంగా జరిగింది. అనంతపురం జిల్లాలో 12 నుంచి 14 శాతం మందికి, నెల్లూరు జిల్లాలో 9 శాతం మందికి కరోనా సోకింది అయినా వారికి తెలియకుండానే తగ్గిపోయింది. వీరంతా కరోనా వచ్చినా ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఇంకా జనంలోనే తిరుగుతున్నారు. తాజాగా గత పది రోజులుగా విడుదలవుతున్న కరోనా పరీక్షల ఫలితాల్లో వైరస్ సోకిన వారిలో కృష్ణా జిల్లా చివరి స్ధానంలో ఉంటోంది. జిల్లాలో అత్యల్పంగా దాదాపు రోజుకు 250 మందికి మాత్రమే కరోనా సోకుతోంది.

ఇది రాష్ట్ర సగటుతో పోల్చినా తక్కువే. దీనికి కారణం ఇక్కడ నిర్వహిస్తున్న అత్యధిక పరీక్షలే అని అధికారులు చెప్తున్నారు. అయితే సీరం సర్వైలెన్స్‌ పరీక్షల్లోనూ ఇదే నిర్ధారణ అయింది. ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నట్లు, అలాగే జనంలో కరోనా వచ్చిపోయినట్లు కూడా తేలింది. ఇలా కరోనా సోకినా లక్షణాలు కనిపించకుండా తగ్గిపోయిన వారి నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం లేదు. ఆ లెక్కన సర్వే జరిపిన నాలుగు జిల్లాల్లో ఒకటైన కృష్ణాలో కరోనా వచ్చిపోయిన వారి శాతం 20గా ఉండటంతో ఈ జిల్లాలో కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉందని తేలింది.