Russia-Ukraine War: ఎటు చూసిన శవాలే, ఉక్రెయిన్ బుచ్చా ప‌ట్టణంలో 410 మందిని క్రూరంగా చంపేసిన రష్యా బలగాలు, ఖండించిన రష్యా రక్షణ శాఖ
Russian forces strike at residential buildings (Photo Credit - Reuters)

Kiev, April 4: ఉక్రెయిన్ రాజధాని కీవ్ స‌మీపంలో ఉన్న బుచ్చా ప‌ట్టణం శ‌వాల దిబ్బ‌గా మారింది. అక్క‌డ భారీ స్థాయిలో ర‌ష్యా సైనికులు సామూహిక హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఓ శ్మ‌శానవాటిక వ‌ద్ద సుమారు 45 అడుగ‌ల గొయ్యి ఉన్న‌ట్లు అమెరికాకు చెందిన మాక్స‌ర్ టెక్నాల‌జీస్ శాటిలైట్ సంస్థ ఫోటోలు రిలీజ్ చేసింది. మార్చి 31వ తేదీన ఆ ఇమేజ్‌ల‌ను తీసిన‌ట్లు ఆ సంస్థ చెప్పింది. సెయింట్ ఆండ్రూ చ‌ర్చి, పెర్వోజ్‌వ‌న్నో ఆల్ సెయింట్స్ చ‌ర్చి వ‌ద్ద ఉన్న మైదానాల్లో సామూహిక ఖ‌న‌నాలు ఉన్న‌ట్లు గుర్తించారు. భారీ కంద‌కాల‌ను తొవ్వుతున్న దృశ్యాల‌ను మార్చి 10వ తేదీన తీసిన చిత్రాల్లో చూడ‌వ‌చ్చని ఆ కంపెనీ తెలిపింది. శ్మ‌శాన‌వాటిక వ‌ద్ద లెక్క‌లేని సంఖ్య‌లో శ‌వాలు ఉన్న‌ట్లు కొంద‌రు జ‌ర్న‌లిస్టులు కూడా పేర్కొన్నారు.

కీవ్‌కు ఈశాన్యంగా 37 కిలోమీటర్ల దూరంలో ఉంది బుచా పట్టణం. నెలరోజుల పాటు జరిగిన రష్యా దురాక్రమణలో (Russia-Ukraine War) సుమారు 300 మంది పౌరులు మరణించినట్లు బుచా మేయర్‌ ఫెడోరుక్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో.. రష్యా బలగాలు తిరుగుముఖం పట్టిన టైంలో మరో 400 మందికి పైగా పొట్టనపెట్టుకుందని (410 Dead Bodies Found in Bucha) చెప్పారాయన. ఎటు చూసినా వీధుల వెంట బుల్లెట్‌ గాయాలతో, కాళ్లు చేతులు కట్టేసి ఉన్న శవాలే దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేషీలోని ఒలెక్‌సీ అరెస్టోవీచ్‌ బుచా ఊచకోతకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ పర్యటన, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన లావ్‌రోవ్‌ పర్యటన

Butcha లో మహిళలపై రష్యా బలగాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డాయని, ఆపై వాళ్లను కట్టేసి నిప్పటించి సజీవ దహనం చేశారని ఆరోపించారు. అంతేకాదు స్థానిక అధికారులు, పిల్లల మృతదేహాలు రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకే చోట 300 మందికి నైరుతి భాగంలో ఉన్న ఓ చర్చి దగ్గర అంత్యక్రియలు నిర్వహించగా.. ఇది రష్యా జరిపిన ఉద్దేశపూర్వక మారణకాండగా ఉక్రెయిన్‌ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. మృతుల్లో ఓ పసికందు, 14 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇండిపెండెంట్‌ దర్యాప్తునకు ఆదేశించింది ఐక్యరాజ్య సమితి.

ఈ ఆరోపణలపై రష్యా కౌంటర్‌ ఇచ్చింది. అదంతా కీవ్‌ నుంచి జరుగుతున్న కుట్రే అని పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బుచాలో శవాల ఫొటోలు, వీడియోలు కీవ్‌ నుంచి వెలువడుతున్న రెచ్చగొట్టుడు సంకేతాలే అని పేర్కొంది. ఇదంతా కీవ్‌వర్గాలు ఆడుతున్న నాటకం. పాశ్చాత్య దేశాల మీడియా కోసమే ఇదంతా చూపిస్తున్నారు. రష్యా బలగాలు అక్కడ ఉన్న టైంలో ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదు. ఎలాంటి హింసకు, అఘాయిత్యాలకు కూడా మా సైన్యం పాల్పడలేదు. శాంతి స్థాపనలో భాగంగానే మా దళాలు ఎలా వెళ్లాయో.. అలాగే వెనక్కి వచ్చేశాయి. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించింది.