US President Joe Biden: తప్పుడు సమాచారంతో ఫేస్బుక్.. ప్రజల్ని చంపేస్తోంది, తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కోవిడ్ టీకాల పంపిణీపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
సోషల్ మీడియా దిగ్గజాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు (US President Joe Biden Hits Out at Facebook) చేశారు. తప్పుడు సమాచారంతో ఫేస్బుక్.. ప్రజల్ని చంపేస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వ్యాక్సినేషన్పై అనవసరమైన సమాచారం ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు ఆయన చెప్పారు.
San Francisco, July 17: సోషల్ మీడియా దిగ్గజాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు (US President Joe Biden Hits Out at Facebook) చేశారు. తప్పుడు సమాచారంతో ఫేస్బుక్.. ప్రజల్ని చంపేస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వ్యాక్సినేషన్పై అనవసరమైన సమాచారం ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ టీకాల పంపిణీపై సోషల్ మీడియాలో (social media) చాలా దారుణమైన రీతిలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని బైడెన్ (US President Joe Biden) తెలిపారు. ఫేస్బుక్ లాంటి ఫ్లాట్ఫామ్ల్లో.. వ్యాక్సిన్లు, మహమ్మారిపై తప్పుడు ప్రచారం సాగుతోందని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (Facebook) ద్వారా ఫేక్ న్యూస్ విస్తరించడంపై వైట్హౌస్ తీవ్ర వ్యాఖ్యల అనంతరం బైడెన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.మనం గుర్తించలేని ఏకైక మహమ్మారి వారిలోనే ఉందని, వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారంతోనే చాలామంది టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదనీ, వీరితోనే అసలైన ముప్పు పొంచి ఉందని బైడెన్ పేర్కొన్నారు.
ఇంతకు మునుపే యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి వ్యాక్సిన్లపై ఫేస్బుక్లో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా ప్రకటించారు. అంతకుముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఫేస్బుక్పై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వ్యాక్సిన్లపై 65 శాతం తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న వారు12 మంది ఉన్నారనీ, మిగతా ప్లాట్ఫామ్లపై వీరిపై నిషేధం ఉన్న వీరంతా ఫేస్బుక్లో మాత్రం చురుకుగా ఉన్నాని ఆరోపించారు. దీనిపై ఫేస్బుక్ తన విధానాన్ని, చర్యలను మార్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు. టీకాలపై తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాపిస్తోందని, దీన్ని నివారించాలని ఆయా సంస్థలపై వైట్ హౌస్ ఒత్తిడి తెస్తోంది.
అయితే ఈ విమర్శలను ఫేస్బుక్ తోసిపుచ్చింది. వాస్తవానికి 2 బిలియన్లకు పైగా ప్రజలు కోవిడ్-19 వ్యాక్సిన్లపై అధికారిక సమాచారాన్ని వీక్షించారని ఫేస్బుక్ ప్రతినిధి డాని లివర్ తెలిపారు. 3.3 మిలియన్లకు పైగా అమెరికన్లు టీకా ఎక్కడ ఎలా పొందాలో తెలుసుకునేందుకు తమ టీకా ఫైండర్ సాధనాన్ని ఉపయోగించారని వివరించారు. వాస్తవాలను చెప్పడం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతున్నామని లివర్ చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలతో తాము చలించబోమని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారిక ఆరోగ్య సమాచారాన్ని అందించేందుకే తాము కృషి చేస్తామని ట్విటర్ ఒక పోస్ట్లో వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Jul 17, 2021 02:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

