COVID-19 in India: 10 నెలల చిన్నారికి కరోనావైరస్ పాజిటివ్, కర్ణాటకలో 50కి చేరిన కోవిడ్-19 కేసులు, తెలంగాణలో 59 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 12 కేసులు నమోదు, 3 నెలల కోసం బడ్జెట్ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినేట్
Representational image | (Photo Credits: Pixabay)

Bengaluru, March 27: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో (Dakshina Kannada)  10 నెలల శిషువుకి కరోనావైరస్ సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయింది. బంత్వాల్ తాలుకాలోని సజిపానాడు గ్రామానికి చెందిన ఈ చిన్నారికి జ్వరంతో పాటు శ్వాసతీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నట్లు గమనించి ఈనెల 23న మంగళూరు హాస్పిటల్ లో చేర్చారు. అయితే శిషువుకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. వైద్యులకు అనుమానాలు రావడంతో కరోనావైరస్ పరీక్షలు కూడా నిర్వహించగా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో శిషువుతో పాటు తల్లిదండ్రులను కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుతో కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 మార్క్ ను అందుకుంది. ఇక కర్ణాతకలో కరోనా మరణాల సంఖ్య శుక్రవారం నాటికి 3కు పెరిగింది.

అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా COVID-19 కేసులు (COVID-19 in India)  శుక్రవారం 724గా ధృవీకరించినప్పటికీ సాయంత్రం నాటికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే కొత్త కేసులు 17 వచ్చాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 147కు పెరిగింది. ఇండియాలో 724, ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు

ఇటు తెలంగాణ (Telangana) లో కూడా ఈరోజు ఒక్కరోజులోనే కొత్త కేసులు నిర్ధారించబడ్డాయని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 59కి చేరాయి.  అయితే చికిత్స పొందుతున్న అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. రెండు, మూడు రోజుల్లో కొంత మంది డిశ్చార్జ్ కాబోతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ పేర్కొన్నారు.

ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసులు శుక్రవారం 12కు చేరాయి. తిరుపతిలో ఇద్దరు వైద్యులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గమనించడంతో వారి నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపారు, రిపోర్ట్ రావాల్సి ఉంది.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి ఈ నేపథ్యంలో 2020-21 సంవత్సరంలో 3 నెలలకు కోసం బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర కేబినేట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.

వైరస్ సంక్రమణను తగ్గించడానికి దేశంలో ప్రస్తుతం ఏప్రిల్ 15 వరకు మొత్తం లాక్డౌన్ అమలులో ఉంది. ఈ క్రమంలో డొమెస్టిక్ విమాన సర్వీసుల రద్దును ఏప్రిల్ 15 వరకు పొడగిస్తున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది.