Nuzividu: అర్థరాత్రి 10 ఏళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారం, నూజివీడులో దారుణ ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Andhra Pradesh man-molested-minor-girl-nuzividu-krishna-district (Photo-Youtube Grab)

Amaravati, Febuary 27: ఏపీలోని (Andhra Pradesh) కృష్ణా జిల్లాలోని నూజివీడులో (Nuzividu) దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై అర్థరాత్రి వేళ ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నాన్న ఎక్కడ ఉన్నాడో చూపుతానని మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ సమీపంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు పట్టణం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన తాపీ మేస్త్రి సరిపల్లి శేషుబాబు బుధవారం రాత్రి 9:30 ప్రాంతం వరకు ఇంటికి చేరుకోలేదు. ఆ సమయంలో శేషు బాబు కుమార్తె, మూడవ తరగతి చదువుతున్న బాలిక, తండ్రి కోసం రోడ్డుపైకి చేరుకుంది. శేషు బాబు తనకు తెలుసునని ఎక్కడ ఉన్నాడో చూపుతానని మాయమాటలు చెప్పిన ఓ అగంతకుడు బాలికను సైకిల్‌పై తీసుకువెళ్లి త్రిబుల్ ఐటీ సమీపంలో అత్యాచారం చేశాడు.

అనంతరం సంఘటన స్థలంలోనే బాలికను వదిలేసి పరారయ్యాడు. ఒంటినిండా గాయాలతో, భరించలేని నొప్పితో బాధపడుతున్న బాలిక కేకలు వేడయం ప్రారంభించింది. రాత్రిపూట పెట్రోలింగ్‌లో ఉన్న నూజివీడు సీఐ పి. రామచంద్రారావుకు కేకలు వినిపించడంతో సంఘటన స్థలానికి వెళ్లి చూశారు. అర్ధరాత్రి సమయంలో ఓ చిన్నపాప అక్కడ ఉండటం చూసి నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు చూసి ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు.

పాప దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడగ్గా..జరిగిన విషయం చెప్పింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాపను వైద్యం హాస్పిటల్ కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.