Mumbai Drug Seizure Case: ముంబై రేవ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి, ఎన్సీబీ అదుపులో షారూఖ్ ఖాన్ కొడుకు, మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు
ముంబయి తీరంలోని కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌకపై శనివారం రాత్రి మాదకద్రవ్యాల నిరోధక శాఖ హఠాత్తుగా దాడి చేయడం (Mumbai Drug Seizure Case) దేశంలో సంచలనం సృష్టించింది. ఈ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోన్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకొన్నారు.
Mumbai, Oct 3: ముంబయి తీరంలోని కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌకపై శనివారం రాత్రి మాదకద్రవ్యాల నిరోధక శాఖ హఠాత్తుగా దాడి చేయడం (Mumbai Drug Seizure Case) దేశంలో సంచలనం సృష్టించింది. ఈ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోన్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్న వారిలో బాలీవుడ్లోని సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ (Aryan Khan, Shah Rukh Khan's Son) కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి కొకైన్, గంజాయి, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.
మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు ఎన్సీబీ ముంబయి డైరెక్టర్ సమీర్ వాంఖడే వెల్లడించారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్న వారిలో బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తోపాటు అతని స్నేహితులు ఉన్నారు. ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న వారిని, అక్కడి సామగ్రిని ముంబయికి తరలించారు.
రేవ్ పార్టీలో (Mumbai Cruise Rave Party) పాల్గొన్న ఆర్యన్ ఖాన్ ఫోన్, మరికొందరి ఫోన్లను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా విచారిస్తే కేసులో కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశముంది. ఆర్యన్ ఖాన్తోపాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా ఎన్సీబీ అధికారులు విచారించనున్నారు. క్రూయిజ్ పార్టీలో చేరడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల కుమార్తెలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్రూయిజ్ పార్టీ ఆర్గనైజర్లకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
ఈ పార్టీని ఢిల్లీకి చెందిన నమస్క్రే ఎక్స్పీరియన్స్, ఫ్యాషన్ టీవీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎఫ్టీవీ డైరెక్టర్ ఖాసిఫ్ ఖాన్ పర్యవేక్షణలోనే ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోందని ఎఫ్టీవీ అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఈ పార్టీ జరగాల్సి ఉంది. కేవలం 100 టికెట్లను మాత్రమే విక్రయానికి ఉంచారు. మిగిలినవి నిర్వాహకులు నేరుగా విక్రయించారు. ఈ పార్టీకి సంపన్నులు ఎగబడ్డట్లు తెలుస్తోంది. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన చాలా మంది నౌకను ఎక్కలేకపోయారు.
సాధారణ ప్రయాణికుల వలే మాదకద్రవ్యాల నిరోధకశాఖ అధికారులు కూడా నౌకలోకి ఎక్కారు. నౌక ముంబయి తీరాన్ని వదిలి సముద్రం మధ్యలోకి చేరగానే పార్టీ మొదలైంది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటి వరకు 13 మంది అధికారుల అదుపులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, అధికారుల నుంచి ఎటువంటి ధ్రువీకరణ లభించలేదు. నౌక యాజమాన్యానికి కూడా అధికారులు నోటీసులు పంపించినట్లు తెలిసింది. నౌకలోని చాలా గదులను అధికారులు తనిఖీ చేశారు. మరికొన్నింటిని తనిఖీ చేయాల్సి ఉంది.
గోవాలో తీగలాగితే ముంబైలో డ్రగ్స్ రాకెట్ డొంక కదలింది. సముద్రం మధ్యలో ఓ భారీ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి అండర్ కవర్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో డ్రగ్స్ తీసుకుంటున్న దాదాపు 10 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 03, 2021 01:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

