Heat wave in India: ఎండలు బాబోయ్ ఎండలు, మరో 3 రోజులు పాటు నిప్పుల వానలా ఎండ, ప్రజలెవరూ బయటికి రావొద్దని అధికారుల సూచన
This summer is likely to be hotter than normal, says IMD forecast (Photo-ANI)

Hyderabad, May 26: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మరో రెండు మూడు రోజులపాటు వేడిగాలులు (Heat waves in India), ఉక్కపోత కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. పలు చోట్ల నిప్పుల వానలా ఎండ (Heat waves) కాస్తుందని తెలిపింది. రాజస్థాన్‌ ఎడారి, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచి వాయవ్య దిశగా వీస్తున్న వేడిగాలులతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి

వచ్చే మూడు రోజులు రాయలసీమలో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశాఖ వాతావరణ కేంద్రం (Vishakha Weather Center) పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వివరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ తెలిపారు. ఇలా ఉండగా ఉపరితల ద్రోణి,ఆవర్తనం కారణంగా మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు.

ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో సోమవారం అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు 46.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 45 డిగ్రీలు, నల్లగొండ జిల్లాలో 44.8, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 43.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. వాయవ్య దిక్కుల నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావం అధికంగా ఉన్న ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి.

రాగల నాలుగు రోజుల వరకు ఈ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాడ్పుల తీవ్రత పగటి పూట పెరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. కాగా వడదెబ్బకు సోమవారం రాష్ట్రంలో ఐదుగురు మృతిచెందారు. పలు రాష్ట్రాల్లో వచ్చే రెండు,మూడు రోజులు వేడిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. వాయవ్య, మధ్య భారత్‌, తూర్పు భారత్‌ ప్రాంతాల్లో ఈ నెల 28 వరకు వేడి గాలులు వీస్తాయన్నారు.  హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, ఇప్పటివరకు 214 కేసులు నమోదు, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ లాక్‌డౌన్ అమలు

దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌, విదర్భ ప్రాంతం, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పరిస్థితి నిప్పుల గుండంలా ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఉత్తర భారత ప్రాంతీయ అధిపతి కుల్‌దీప్‌ శ్రీవాత్సవ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదవుతాయని, దీనివల్ల వేడి గాలులు కూడా వీస్తాయన్నారు.

ఈ నెల 29, 30వ తేదీల్లో ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుఫాన్‌తోపాటు చిరు జల్లులు కురుస్తాయి. దీని ప్రభావంతో 50-60 కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీయడంతో ప్రజలకు ఊరట లభిస్తుందని శ్రీవాత్సవ వివరించారు. మధ్యధరా సముద్ర పరిధిలో ఏర్పడిన తుఫాన్‌ మధ్యాసియా మీదుగా హిమాలయాలను తాకుతుందన్నారు. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.