Coronavirus in India: కరోనా నుంచి కోలుకున్నపేషెంట్ ఆత్మహత్య, కోవిడ్-19 పోతుందని 400 గొర్రెలు ఝార్ఖండ్‌లో బలిచ్చారు, డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య
Coronavirus Outbreak in India . |(Photo Credits: PTI)

New Delhi, June 11: భారత్‌లో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in India) రికార్డు అయ్యాయి. నిన్న ఒక రోజులోనే 357 మంది కూడా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 286579గా నిలిచింది. ఇందులో యాక్టివ్‌ కేసులు 137448గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వైరస్‌ సంక్రమించిన వారిలో 141029 మంది కోలుకున్నట్లు పేర్కొన్నది.  కరోనాతో ఎన్‌సీపీ కార్పొరేట‌ర్ మృతి, ముంబైలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మరణించిన ముకుంద్ కేని

దేశంలో ఇప్పటి వరకు వైరస్‌ వల్ల చనిపోయిన వారి సంఖ్య (Coronavirus deaths in india) 8102గా ఉన్నది. దేశవ్యాప్తంగా జరిగిన వైరస్‌ శ్యాంపిళ్ల పరీక్షలకు సంబంధించిన అప్డేట్‌ను ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 5213140 మందికి వైరస్‌ టెస్టింగ్‌ నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొన్నది. గత 24 గంటల్లో దేశంలో 151808 మందికి పరీక్ష చేసినట్లు చెప్పింది.

దేశ రాజధాని ఢిల్లీలో (COVID-19 Delhi) గత 24 గంటల్లో 1500కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 32 వేలను దాటింది. జూలై చివరి నాటికి రాజధానిలో 5 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు ఉండవచ్చ‌ని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. అటువంటి పరిస్థితిలో, రాజధానిలోని ఆసుపత్రుల‌తో స‌హా పడకలు, ఇతర సౌకర్యాల గురించి ప‌లు సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా ఢిల్లీ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీనిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో గ‌ల కోవిడ్ పడకలు, వెంటిలేటర్ల తాజా డేటాను అందుబాటులో ఉంచింది.  పుట్టినరోజే కరోనాతో ఎమ్మెల్యే మృతి, కోవిడ్-19 కేసుల్లో వూహాన్ నగరాన్ని మించిపోయిన ముంబై

పెరుగుతున్న కరోనా కేసులను చూస్తుంటే జూలై 31 నాటికి రాజధానిలో ఐదున్నర మిలియన్లకు చేరుకుంటాయ‌ని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. మ‌రోవైపు ఢిల్లీవాసుల‌తో పాటు ఢిల్లీ వెలుపల ఉన్నవారు కూడా ఢిల్లీలో చికిత్స పొందుతున్న‌ప్పుడు ఈ సంఖ్య మ‌రింత‌గా పెరుగుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో ప్ర‌స్తుతం 32 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు ఉండ‌గా, మరణాల సంఖ్య వెయ్యికి చేరువ‌వుతోంది.

మహారాష్ట్రలో (Maharashtra) నిన్న ఒక్క రోజే ఏకంగా 149 మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,438 మరణాలు నమోదయ్యాయి. ఇక, నిన్న 3,254 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 94,041కు చేరుకుంది. అలాగే, నిన్న 1,879 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,517కి పెరిగింది.

కేరళలోని (Kerala) తిరువనంతపురంలో కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న 33 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య (Patient Suicide) చేసుకున్నాడు. కరోనా బారినపడిన యువకుడు ఇటీవల తిరువనంతపురం వైద్యకళాశాలలో చేరాడు. ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో రెండుసార్లు ఆసుపత్రి నుంచి పారిపోయిన రోగి తన ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసిన గ్రామస్థులు తిరిగి అతడిని పోలీసులకు పట్టించారు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. దీంతో అతడిని డిశ్చార్జ్ చేయాలని అధికారులు నిర్ణయించి అతడు ఉంటున్న ఐసోలేషన్ గదికి వెళ్లి చూడగా సీలింగుకి వేలాడుతూ కనిపించాడు.

కరోనా వైరస్ పోవాలంటూ ఝార్ఖండ్ లోని (Jarkhand) ఓ గ్రామవాసులు 400 గొర్రెలను గ్రామ అమ్మవారి ఆలయంలో బలిచ్చారని తెలిసింది. ఈ ఘటన కొడెర్మా జిల్లాలోని చంద్వారా బ్లాక్ పరిధిలో ఉన్న ఉర్వాన్ గ్రామంలో జరిగింది. కరోనా మహమ్మారి బారి నుంచి తమ గ్రామానికి రక్షణ కలుగుతుందన్న నమ్మకంతోనే ఈ పని చేశామని, తాము గ్రామ దేవతను నమ్ముతాము కాబట్టే గొర్రెలను బలిచ్చామని గ్రామస్థులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.