COVID19 in India: భారత్‌లో గడిచిన ఒక్కరోజులో 6,148 కోవిడ్ మరణాలు నమోదు, బిహార్ రాష్ట్రం తమ గణాంకాలను సవరించడమే కారణం; దేశవ్యాప్తంగా కొత్తగా 94,052 మందికి కరోనా
Coronavirus pandemic (Photo-PTI)

New Delhi, June 10: భారత్‌లో సెకండ్ వేవ్ కోవిడ్ అదుపులోకి వస్తోందనుకుంటుండగా, గడిచిన ఒక్కరోజులో నమోదైన కోవిడ్ మరణాలు గణాంకాలు ఒక్కసారిగా ప్రజలను షాక్‌కు గురిచేశాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 6,148 కోవిడ్ మరణాలు నమోదైనట్లు నివేదించారు. ఇందులో 3971 మరణాలు ఒక్క బిహార్ రాష్ట్రం నుంచే ఉండటం గమనార్హం. అయితే దీని గురించి చింతించాల్సిన అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. బిహార్ రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ కలిగి, ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారిని పరిగణలోకి తీసుకోక పోవడంతో వాటన్నింటినీ కోవిడ్ మరణాల జాబితాలో చేర్చాలని ఆ రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించారు. దీంతో మరో 3951 కోవిడ్ మరణాలు అదనంగా చేర్చబడ్డాయి. ఈ క్రమంలో నేటి కోవిడ్ బులెటిన్‌లో దేశ కోవిడ్ మరణాలు గణనీయంగా పెరిగాయి.

ఇక, దేశంలో ప్రతిరోజూ నమోదయ్యే రోజూవారీ కోవిడ్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులున్నప్పటికీ పాజిటివిటీ రేటు క్రమంగా పడిపోతుంది. వరుసగా మూడో రోజు లక్షకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి మెరుగుపడుతోంది. తాజాగా దేశంలో కోవిడ్ రికవరీ రేటు సుమారు 95 శాతానికి పెరిగింది.

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 94,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కేసులు స్వల్పంగా సుమారు 2 వేల మేర పెరిగాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. నిన్న ఒక్కరోజే 6,148 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,59,676కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,51,367 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,76,55,493 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94.77% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 4.00 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.23% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూన్ 9 నాటికి దేశవ్యాప్తంగా 37,21,98,253 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 20,04,690 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 33,79,261 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 24.27 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 24,27,26,693 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 19,54 కోట్లు ఉండగా, 4.72 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.