'Don't Insult Me Like This': చిల్లర రాజకీయాలు చేయొద్దు, బెంగాల్ ప్రజల కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికైనా రెడీ, చీఫ్ సెక్రటరీ బదిలీ రద్దు ఆపండి, బీజేపీ పార్టీపై విరుచుకుపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
రాష్ట్రంలో ఓటమిని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనను ప్రతిసారీ అవమానిస్తున్నారని, బెంగాలీల కోసం అవసరమైతే మోదీ కాళ్ళు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని చెప్పారు.
Kolkata, May 29: భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య బెంగాల్లో ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి తగ్గడం లేదు. తాజాగా యాస్ సైక్లోన్ రివ్యూ మీటింగ్ సంధర్భంగా మరోసారి బీజేపీ పార్టీ, మమతా బెనర్జీ పరస్పర ఆరోపణలు (Mamata Banerjee Hits Back at PM Narendra Modi) చేసుకున్నారు. యాస్ తుపానుపై జరిగిన పీఎం, సీఎంల సమావేశంలో ఏకంగా మాటల తూటాలు పేల్చారు. బెంగాల్కి మేలు చేస్తానంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకునేందుకు ( I am ready to do that but I should not be insulted) తాను సిద్ధమంటూ సీఎం మమత బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.
చిల్లర రాజకీయాలు చేస్తూ బెంగాల్ ప్రజలను అవమానపరచొద్దంటూ బీజేపీకి, ప్రధాని మోదీలకు (PM Narendra Modi) తేల్చి చెప్పారు.. బెంగాల్ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న చీఫ్ సెక్రటరీ బదిలీని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని మమత బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మమత బెనర్జీ (Mamata Banerjee) ఉద్దేశపూర్వకంగానే చాలా సేపు వేచి ఉండేలా చేసినట్లు వచ్చిన వార్తలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఓటమిని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనను ప్రతిసారీ అవమానిస్తున్నారని, బెంగాలీల కోసం అవసరమైతే మోదీ కాళ్ళు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని చెప్పారు.
మే 28న జరిగిన సంఘటనలను వివరించేందుకు ఆమె ప్రత్యేకంగా ఓ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ముందుగానే షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తుపాను తర్వాతి పరిస్థితిని పరిశీలించేందుకు ప్రధాన మంత్రి బెంగాల్ వస్తున్నట్లు చెప్పారన్నారు. అందుకు అనుగుణంగా తాము ప్రణాళికను రచించామని చెప్పారు. తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడానికి ముందు ఒక గంటపాటు తమను వేచి ఉండేలా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చేశారన్నారు.
ఆయన హెలికాప్టర్ దిగే స్థలానికి చేరుకుని ఎదురు చూశామని... ఆ తర్వాత ఆయన్ని కలిసేందుకు వెళితే మీటింగ్లో ఉన్నారని, ఎవరికీ అనుమతి లేదని చెప్పడంతో అక్కడ మరో 20 నిమిషాల పాటు ఎదురు చూశామన్నారు. ఆ తర్వాత కాన్ఫరెన్స్హాల్లో ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశం ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లామన్నారు. అయితే అక్కడ ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారని మమత తెలిపారు. దీంతో వెంటనే ప్రధానికి తమ రిపోర్టును సమర్పించి... ఆయన అనుమతి తోనే అక్కడి నుంచి బయటకు వచ్చామన్నారు. ఆ వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు తాను వెళ్లినట్టు మమత వివరించారు.
ప్రధాన మంత్రి-ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుందని అంతకుముందు చెప్పారన్నారు. ఈ సమావేశంలో ఇతరులు కూడా పాల్గొనడంతో నివేదికను సమర్పించాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి వద్ద అనుమతి తీసుకుని తాను డిఘాలో తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్ళానని వివరించారు. తాను ప్రధాన మంత్రి అనుమతిని మూడుసార్లు కోరానని చెప్పారు. ‘‘సార్, మీ అనుమతితో నేను వెళ్ళవచ్చునా? మేం డిఘా వెళ్ళి, తుపాను నష్టాన్ని అంచనా వేయవలసి ఉంది, వాతావరణం కూడా అంత బాగా లేదు’’ అని తాను మోదీతో చెప్పానని తెలిపారు. ఆ తర్వాత మాత్రమే తాము అక్కడి నుంచి డిఘా వెళ్ళామని తెలిపారు.
ఆ సమావేశ మందిరంలో కొన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయని, అయితే తాము డిఘా వెళ్ళవలసి ఉన్నందువల్ల అక్కడ కూర్చోవలసిన అవసరం తమకు రాలేదని చెప్పారు. అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నట్లు ఓ ఫొటోను మీడియాకు విడుదల చేశారని, ఇది సరైనది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ తనను ఇలాగా టార్గెట్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి గుజరాత్, ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించినపుడు ప్రతిపక్షాల సభ్యులు హాజరు కాలేదని గుర్తు చేశారు. కానీ బెంగాల్లో మాత్రం ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారన్నారు. ‘‘మీరు ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ మా ప్రభుత్వ కార్యకలాపాలను గందరగోళపరచడానికి ఏదో ఒకటి చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం సెలక్టివ్ న్యూస్తో తనను లక్ష్యంగా చేసుకుందని మమత ఆరోపించారు. ఆ వార్తలు ఏకపక్షంగా ఉన్నాయని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీల్లేకుండా రాశారని దుయ్యబట్టారు. అందుకే తాను ఈ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశానని, జరిగిన విషయాలన్నీ చెప్పడానికే మాట్లాడుతున్నానని అన్నారు. తనకు జాతీయ స్థాయి మీడియాలో కొందరు మిత్రులు ఉన్నారని, కొన్నిసార్లు తమకు పీఎంఓ నుంచి సూచనలు వస్తూ ఉంటాయని వారు చెప్పారని అన్నారు.
తనపై పక్షపాతంతో కూడిన వార్తలను రాయాలని పీఎంఓ నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయని వారు చెప్పారన్నారు. ఆ వార్తల ఆధారంగా తనను అవమానించేందుకు ఇటువంటి సూచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం కూడా ఇదేవిధంగా సెలక్టివ్ న్యూస్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు.
ఇటీవల వచ్చిన తుపానుల నష్టాన్ని అంచనా వేసేందుకు గుజరాత్, ఒడిషాలలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ రాష్ట్ర సీఎంలతో సమావేశమయ్యారు, కానీ ఎక్కడా ప్రతిపక్ష నేతలను ఆ సమావేశాలకు ఆహ్వనించలేదని మమత చెప్పారు. కేవలం బెంగాల్లోనే ఎందుకు ప్రతిపక్ష పార్టీలను మీటింగ్కు పిలిచారని ఆమె అడిగారు. ఇటీవల బెంగాల్లో ఎదురైన ఘోర ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతుందని, అందుకే ఆ ఓటమికి ప్రతీకారంగా బెంగాల్ ప్రజలను అవమానించాలని చూస్తున్నారంటూ మమత ఆరోపించారు. ప్రధాని ఎప్పుడు బెంగాల్కి వచ్చినా ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారంటూ ఆమె విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర సర్వీసుల్లోకి పిలిపించారని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నానని చెప్పారు. ఆయనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘ఇలా చేయడం ద్వారా మీరు దేశంలోని అందరు చీఫ్ సెక్రటరీలను అవమానిస్తున్నారు’’ అన్నారు. బ్యూరోక్రాట్ వ్యవస్థనే అవమానించినట్లవుతుందని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి: ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం మమతా బెనర్జీ 30 నిమిషాల పాటు ఆలస్యంగా రావడంపై బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి మరోసారి తీవ్రంగా స్పందించారు. ప్రధాని సమీక్షా సమావేశానికి సీఎం మమత ఆలస్యంగా రావడం సిగ్గుచేటని మండిపడ్డారు. అలాగే రాజ్యంగ సమగ్రతను ఉల్లంఘించడమే అవుతుందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలున్న సమావేశానికి తాను రాలేనని మమత ఒత్తిడితోనే అన్నారని, తన అహంకారంతోనే ఆమె అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం మమత ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, జాతీయ నాయకురాలు కాదని, ఆమె జాతీయ నాయకురాలిగా భావించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమీక్షా సమావేశంపై మమత ప్రకటన కల్పితంగా కనిపిస్తోందని, రాష్ట్ర ప్రజలను సీఎం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒడిశా సీఎంకు ఎలాగైతే సమావేశం గురించి చెప్పామో, అలాగే సీఎం మమతకు కూడా మోదీ సమీక్ష గురించి తెలిపామని, కానీ ఆమె మాత్రం సాకులు చెబుతోందని సుబేందు మండిపడ్డారు.
(The above story first appeared on LatestLY on May 29, 2021 07:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

