BBC Documentary Ban Row: ఓ లఘుచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, బీబీసీ ఇండియాపై నిషేధం పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులు చూపించాలని ఆదేశాలు
ఈ రోజు విచారణకు రాగా.. బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court Dismisses Plea) తిరస్కరించింది.ఈ సందర్భంగా పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
New Delhi, February 10: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఇండియా ద మోదీ క్వశ్చన్ పేరిట ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీని (BBC Documentary on Narendra Modi), దానికి సంబంధించిన లింకులను భారత్లో బ్లాక్ చేసింది. దీంతో, ఈ వ్యవహరం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి విదితమే.ఈ రోజు విచారణకు రాగా.. బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court Dismisses Plea) తిరస్కరించింది.ఈ సందర్భంగా పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓ లఘుచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదని సుప్రీం కోర్టు పిటిషనర్లు హిందూసేన చీఫ్ విష్ణు గుప్తాతోపాటు బీరేంద్ర కుమార్ సింగ్ను ప్రశ్నించింది. ఈ పిటిషన్ను విచారణకు తిరస్కరించింది.ఈ విషయంపై పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్.. భారత్కు, భారత ప్రభుత్వానికి బీబీసీ వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ‘భారత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా’ తాజా లఘుచిత్రాన్ని రూపొందించిందని అన్నారు.
దీని వెనక ఉన్న కుట్రను బహిర్గతం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కోరారు. పిటిషనర్ అభ్యర్థనను విన్న జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్లతో కూడిన ధర్మాసనం.. దీనిని తప్పుగా భావించారని, ఇది విచారణకు అనర్హమని పేర్కొంది. నిషేధంపై ఆదేశాలు న్యాయస్థానం ఎలా జారీ చేస్తుందని పిటిషనర్ను ప్రశ్నించింది.
కాగా గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్రం బ్యాన్ విధించింది. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఈ వీడియో క్లిప్లు కనిపించకుండా సెన్సార్ విధించింది.బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్-2022 కింద అత్యవసర అధికారాలను ఉపయోగించి నిషేధించింది. ఈ క్రమంలోనే హిందూ సేన అసలు బీబీసీ ఛానల్నే సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చివరకు ఆ పిటిషన్ను తిరస్కరించింది.
అంతకుముందు అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కేంద్రం సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పింది.టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, పాత్రికేయుడు ఎన్ రామ్, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత వారం విచారణ జరిపింది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్తో కూడిన ట్వీట్లను తొలగించాలని ఎందుకు నిర్ణయించారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లోగా ఈ వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఏప్రిల్లో జరుగుతుందని తెలిపింది.
(The above story first appeared on LatestLY on Feb 10, 2023 05:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

