Uttarakhand Glacier Burst: ఉత్తరాఖండ్ విలయం, 12 మందికి ప్రాణం పోసిన ఫోన్ కాల్, ఐటీబీపీ అధికారుల చలవతో సురక్షితంగా బయటకు, ఐటీబీపీకి ధన్యవాదాలు తెలిపిన కార్మికులు
Uttarakhand Glacier. (Photo Credits: ANI)

Joshimath, February 8: అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలతో ఉత్తరాఖండ్‌ విలవిలలాడిన సంగతి విదితమే. చ‌మోలీ జిల్లాలో మంచు చ‌రియ‌లు విరిగిప‌డ‌డం, ధౌలిగంగా నది ఉగ్రరూపంతో ఉత్తరాఖండ్ జల ప్రళయాన్ని చవిచూసింది. అయితే ఈ జల విలయంలో ఓ ఫోన్ కాల్ 12 మందిని (Phone Call Saved Their Lives) కాపాడింది.

ధౌలీనది ఉగ్ర రూపానికి (Uttarakhand Glacier Burst) చమేలి తపోవన్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ వర్కర్లు 12 మంది అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌లో పనిచేస్తూ అక్కడే చిక్కుకుపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న వారిని బయటకు రావాలని కోరారు. అయితే వారు బయటకు వద్దామనుకునే లోపే వరద నీరు టన్నెల్‌లోకి వచ్చింది. వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా ప్రవేశ మార్గాన్ని బురద కప్పేసింది.

ఇక టన్నెల్‌ నుంచి బయటపడే మార్గం లేకపోవడం.. బయట ఉన్న బురద వల్ల లోపల ఉన్న తమ గురించి అధికారులకు తెలిసే అవకాశం ఉండదని భావించిన ఆ 12 మంది వర్కర్లు జీవితం మీద ఆశ వదిలేసుకున్నారు. అయితే ఓ రోజు తర్వాత టన్నెల్ లోపల కొంచెం వెలుతురు కనపడటంతో ఆ చోటకు వారు వెళ్లారు.

14కు చేరిన మృతుల సంఖ్య, వాయుసేన ఏరియల్ సర్వేలో కనపడని తపోవన్ డ్యామ్, మరణించిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం, రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఉత్తరాఖండ్ సీఎం రావత్

అక్కడ కార్మికుల్లో ఒకతనికి ఫోన్‌కి సిగ్నల్‌ అందడంతో వెంటనే కంపెనీకి కాల్‌ చేసి తమ పరిస్థితిని వివరించాడు. ఈ విషయాన్ని కంపెనీ జీఎం ఐటీబీపీ (Indo-Tibetan Border Police) అధికారులకు చెప్పడంతో వారు టన్నెల్‌ వద్దకు చేరుకుని బురదను తొలగించి.. వర్కర్లను సురక్షితంగా బయటకు (Recount Survivors) తీసుకువచ్చారు. ఆ తర్వాత వీరందరిని ఐటీబీపీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

దేవభూమిలో అసలేం జరిగింది? మృత్యుఘోషకు కారణాలు ఏంటీ? ఇంకా కానరాని 170 మంది ఆచూకి, కొనసాగుతున్న సహాయక చర్యలు, ఉత్తరాఖండ్ విలయంపై ప్రత్యేక కథనం

ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘మేం 300 మీటర్ల లోతైన టన్నెల్‌లో ఉన్నాం. వరద నీటిలో చిక్కుకున్నాం. ఇక జీవితం మీద ఆశ వదిలేసుకున్నాం. ఈ సమయంలో టన్నెల్‌లో ఓ చోట వెలుతురు పడటం.. గాలి ఆడటం గమనించాం. ఎలాగోలా అక్కడకు చేరుకున్నాం. ఇంతలో మాలో ఒకరి ఫోన్‌కి సిగ్నల్‌ వచ్చింది. అధికారులకు కాల్‌ చేయడం.. వారు స్పందించి ఐటీబీపీ వారిని పంపిచడంతో బతికి బయటపడ్డాం. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ మా 12 మందిని కాపాడింది. మాకు సాయం చేసిన ఐటీబీపీ అధికారులకు జీవితాంతం రుణపడి ఉంటాం’’ అన్నారు.