Bypoll Results 2021: కమలానికి రైతుల సెగ తగిలిందా..30 అసెంబ్లీ స్థానాల్లో 7 సీట్లకే పరిమితమైన బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ విజయం, మూడు లోక్సభ స్థానాల్లో ఒకదానికే పరిమితమైన కాషాయం పార్టీ
దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి నిరాశనే మిగిల్చాయి. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు (Bypoll Results 2021) జరగ్గా అందులో కేవలం ఒక లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. అధికారంలో ఉన్న చోట కూడా బీజేపీ పరాజయం పాలైంది.
New Delhi, Nov 2: దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి నిరాశనే మిగిల్చాయి. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు (Bypoll Results 2021) జరగ్గా అందులో కేవలం ఒక లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. అధికారంలో ఉన్న చోట కూడా బీజేపీ పరాజయం పాలైంది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానం గెలుచుకుని భవిష్యత్ రాజకీయాల మీద ఆశలు చిగురింపజేసుకుంది.
పశ్చిమబెంగాల్లోని 4 స్థానాల్లో, హిమాచల్ప్రదేశ్లోని 3 స్థానాల్లో బీజేపీ ఘోర పరాజయం (Shock defeat in Himachal pradesh) మూటగట్టుకున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రైతుల ఆందోళన సెగ తగిలిందా అనే కోణంలో ఆలోచన చేయాల్సిన పరిస్థితులు (wake-up call for BJP as congress win big) తారసపడుతున్నాయి. ఏడాది కాలంగా మూడు వ్యవసాయ చట్టాలను (New Farm Laws) వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమం చేస్తున్నారు. అయితే ఇది పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మాత్రమే ఉందని బీజేపీ భావిస్తూ వస్తోంది. తాజాగా హిమాచల్ లో జరిగిన ఎన్నికల్లో ఈ రైతు ఉద్యమ సెగ బాగా తగిలిందనే చెప్పవచ్చు. అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ ఆ రాష్ట్రంలో ఖాతాను తెరవలేదు.
ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా మరికొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, మిజోరాం, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా అక్కడి ఫలితాలు నిరాశపరిచాయి. ఇక బిహార్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్డీయూ కూటమి ఉన్నా అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొంత మేర మాత్రమే ప్రభావం చూపగలిగింది.
అస్సాంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీజేపీ 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మధ్యప్రదేశ్లో మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటితో పాటు ఒక లోక్సభ స్థానాన్ని బీజేపీ పార్టీ గెలుచుకుంది. ఇక కర్ణాటకలో రెండిండిలో ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. బీజేపీ అధికారంలో ఉన్నా హంగల్ అసెంబ్లీ స్థానంలో ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలో ఈ నియోజకవర్గం ఉన్నా ఆయన తన పార్టీని గెలిచిపించుకోలేకపోయారు. ఇక మరో స్థానమైన సిండ్గీ లో కేవలం 7,500 ఓట్ల మెజారిటీ బీజేపీ బయటపడింది.
తెలంగాణలో ఒక స్థానంలో బీజేపీ గెలుచుకుంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ నెగ్గినా.. అది అభ్యర్థి ఇమేజ్తో దక్కిన విజయమే తప్ప బీజేపీ గొప్పతనంగా చెప్పలేం. ఇక ఎన్డీయే అధికారంలో ఉన్న బిహార్లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఇక పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీపడ్డ బీజేపీకి మూడు చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తంగా చూస్తే 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ కేవలం అసోంలో 3 స్థానాల్లో, మధ్యప్రదేశ్లో రెండు స్థానాల్లో, కర్ణాటక, తెలంగాణలో ఒక్కో స్థానంలో గెలిచింది. మిగతా అన్ని స్థానాల్లో ఆ పార్టీకి ఓటమే గతి అయ్యింది.
హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మూడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అన్నింటా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఇక హర్యానాలోని ఏకైక నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోయింది. అక్కడ ఎల్లెనాబాద్ నియోజకవర్గంలో INDL నుంచి పోటీ చేసిన అభయ్ సింగ్ చౌతాలా 6,700 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి గోబింద్ ఖండాపై గెలిచారు. ఇక్కడ రైతులు ఉద్యమంగా తీవ్రంగా ఉన్న సంగతి విదితమే.
హిమాచల్ప్రదేశ్లోని మండి, మధ్యప్రదేశ్లోని ఖంద్వా, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలోని దాద్రానగర్ హవేలీ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. కేవలం ఖంద్వా నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ గెలిచింది. మండిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాద్రానగర్ హవేలీ లోక్సభ సీటును శివసేన గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన కాలాబెన్ డెల్కర్ తన ప్రత్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసిన మహేష్ గావిట్ పై 51,269 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈమె గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచి మరణించిన మోహన్ డెల్కర్ భార్య. ఈమె 1,18,035 ఓట్లు సాధించగా, ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మహేశ్ గవిత్ 66,766 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ ధోడి 6,150 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, ఉప ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి.
(The above story first appeared on LatestLY on Nov 02, 2021 09:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

