
New Delhi, August 26: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీతో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ (Ghulam Nabi Azad Quits Congres) తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పదవికి ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చిన 4,5 గంటల వ్యవధిలోనే గులాంనబీ ఆజాద్ రాజీనామా చేయడం గమనార్హం.
ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను (Sends Resignation Letter to Sonia Gandhi) పంపించారు. తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాకే పార్టీ నాశనమైందని విమర్శలు గుప్పించారు. సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీది.. చిన్నపిల్లల మనస్తత్వం.. సీనియర్లు అందరిని రాహుల్ పక్కన పెట్టేశారంటూ పేర్కొన్నారు. హోదా లేనప్పటికీ అన్నింటిలో రాహుల్ జోక్యం పెరిగిందని ఆరోపణలు చేశారు.
ఆయనను జమ్మూకశ్మీర్లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, బీజేపీ మాత్రం ఆజాద్కు అరుదైన గౌవరం ఇచ్చింది. ఈ ఏడాది పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది.