Pawan Kalyan on RTC strike: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తానంటున్న పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్న జనసేన అధినేత
Janasena Party Chief Pawan Kalyan | File Photo.

Hyderabad, October 31: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) , ఇతర నాయకులు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో బంజారాహిల్స్ లోని జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. తమ సమ్మె (TSRTC Strike)కు మద్ధతు ఇవ్వాల్సిందిగా ఆయనను కోరారు. ఆర్టీసీ నాయకుల విజ్ఞప్తిపై పవన్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై రెండు రోజుల్లో తెలంగాణ సీఎంను కలిసి ప్రత్యేకంగా చర్చిస్తానని చెప్పారు.

27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. 16 మంది ప్రాణాలు విడిచారు, అందులో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం బాధ కలుగుతుందని పవన్ అన్నారు. కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోకూడదని సూచించారు. సమ్మెపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మంచిది కాదు, ఇది కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదని వారి కుటుంబాల సమస్య కూడా అని పవన్ అన్నారు. సీఎం కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని లేదా చర్చలకు సుహృద్భావ వాతావరణం కల్పించాలని కోరతాం అన్నారు. ఒకవేళ కేసీఆర్ పట్టించుకోని పక్షంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యాచరణకు తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు.  గెలుపు కోసం, వ్యక్తిగత లబ్ది కోసం పాకులాడే వ్యక్తిని కాదు, జనసేన ఓడిపోలేదు

పవన్ స్పందన పట్ల ఆర్టీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు, సమ్మె ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ తమకు మద్ధతుగా ఉంటూ వస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమతో పాటు పని చేసి నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు నేడు తమని పట్టించుకోకపోయినా, పవన్ కళ్యాణ్ పట్టించుకుంటున్నారని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు.