 
                                                                 Mumbai, November 23: మహా రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా సాగుతున్నాయి. తమ పార్టీకి ఎన్సీపీ నుంచి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇందుకు సంబంధించిన లేఖను ఆ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఇచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Nationalist Congress Party (NCP) chief Sharad Pawar) వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన విషయం విదితమే
'అన్ని పార్టీల వద్ద తమ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలు ఉంటాయి. ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ (Ajit Pawar) ఉన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలు సాధారణంగా ఆయన వద్దే ఉంటాయి. వాటినే తీసుకెళ్లి ఆయన ఇచ్చి ఉండొచ్చని నేను భావిస్తున్నాను' అని శరద్ పవార్ తెలిపారు.
'బల నిరూపణకు దేవేంద్ర ఫడ్నవిస్ ఆద్వర్యంలోని బీజేపీకి (Devendra Fadnavis government) గవర్నర్ (Governor Bhagat Singh Koshyari) వారికి అవకాశం ఇచ్చారు. అయితే, బీజేపీ మెజార్టీ నిరూపించుకోలేదని నేను కచ్చితంగా చెప్పగలను. బల నిరూపణ తర్వాత మా మూడు పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి' అని శరద్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు భయపడే ఆయన ఈ పనికి పాల్పడ్డారా? అన్న అనుమానం కలుగుతుందన్నారు. బీజేపీకి మేము మద్దతు ఇవ్వలేదు, అజిత్ పవార్ది వ్యక్తిగత నిర్ణయం, అజిత్ నిర్ణయాన్ని మేము స్వాగతించడం లేదు అన్నారు
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. తమ మూడు పార్టీలకు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఉందని, కొందరు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారని చెప్పారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ( Shiv Sena President Uddhav Thackeray) తో కలిసి ఆయన ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీకి వ్యతిరేకంగా అజిత్ పవార్ వ్యవహరించారని, ఆయన హద్దులు మీరారని శరద్ పవార్ అన్నారు. ఎన్సీపీ నుంచి ఒక్క నేత కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా లేరని వివరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందని, ఎమ్మెల్యేలందరూ గుర్తుంచుకోవాలని, శాసనసభ్య సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. నిజమైన ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ బీజేపీతో చేతులు కలపబోరని వ్యాఖ్యానించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
