Hyderabad, Oct 4: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారంవరకు 31.53 లక్షల కరోనా పరీక్షలు (TS Covid Report) పూర్తిచేయగా, 1.97 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. ఇందులో 1.67 లక్షల మంది కోలుకోగా, 28,328 మంది ఇండ్లు, ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నట్టు శనివారం వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. శుక్రవారం కొత్తగా 1,718 మందికి పాజిటివ్ (New Covid Cases) వచ్చింది. జీహెచ్ఎంసీలో (GHMC) 285, రంగారెడ్డిలో 129, మేడ్చల్ మల్కాజిగిరిలో 115, కరీంనగర్లో 105, నల్లగొండలో 103 కేసులు నమోదయ్యాయి.
దేశంలో రికవరీ రేటు 83.08% ఉండగా, తెలంగాణలో 85.05 శాతానికి చేరుకున్నది. కోవిడ్–19తో మరో ఎనిమిది మంది మరణించగా ఇప్పటివరకు నమోదైన మరణాలు 1,153కు (Covid Deaths) పెరిగాయి.ప్రతి పది లక్షల జనాభాకు 84,729 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు తీసుకున్న శాంపిల్స్లో 994 మందికి సంబంధించి రిపోర్టులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది.
కోవిడ్–19 సమయంలో ప్రతి ఇల్లూ ఒక ఆయుర్వేద కేంద్రంగా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చాలామంది సహజసిద్ధంగా ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించి రోగనిరోధక శక్తిని పెంచుకున్నారని పేర్కొన్నారు. శనివారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వైద్య, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆయుష్ డిపార్ట్మెంట్కు సంబంధించి గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమలు చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్లో 2,034 పోస్టులు, పీహెచ్సీల్లో 5,658 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రతి సబ్ సెంటర్ నుంచి పీహెచ్సీ వరకు అన్నీ ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశించారు.
ప్రతి ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్ ఉండాలని, సీటీస్కాన్, పూర్తిస్థాయి ల్యాబ్లు ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్న చోట్ల అన్నిరకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, వాటికి వార్షిక నిర్వహణ నిధులు విడుదల చేయాలని మంత్రి అన్నారు. చికిత్స వివరాలను రోగికి, వారి బంధువులకు ఎప్పటికప్పుడు అందించాలని, అందుకు పేషంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 90 శాతం మంది పేషంట్లకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లోనే చికిత్స అందించాలని, పెద్ద జబ్బులు ఉన్న వారు మాత్రమే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు.