
Newdelhi, Mar 1: పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఫిబ్రవరిలో ఎండలు దంచికొట్టడం.. ప్రజలు ఆపసోపాలు పడటం తెలిసిందే. దేశంలో 1901 తర్వాత ఎన్నడూ చూడనంతగా గడిచిన ఫిబ్రవరి నెలలో (Warmest February In India) రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు వెల్లడించారు. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మొదటిసారి సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని తెలిపారు. 124 ఏళ్ల తర్వాత అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరిగా ఇది నమోదైందని వెల్లడించారు.
మార్చిలోనూ అంతే..
ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని హెచ్చరించింది.