Tirumala Srivari Brahmotsavam: సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Tirupati Temple | Image Used for Representational Purpose (Photo Credit: PTI)

కొవిడ్ తగ్గుముఖం పట్టడడంతో తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపాలని టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయించింది. ఇవాళ తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా సర్వదర్శనాల టైమ్‌స్లాట్‌‌ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చైర్మన్‌ మీడియాకు వెల్లడించారు.

ఇక రెండున్నర సంవత్సరాల తర్వాత జరగబోయే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై (Tirumala Srivari Brahmotsavam) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను (September 27 to October 5) తిరువీది ఊరేగింపుగా నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే తిరుమలలోని పార్వేట మండపం ఆధునీకరణ కోసం రూ. 2.20 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు.

అలాగే, అమరావతిలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవన అభివృద్ధికి రూ. 2.20 కోట్లు కేటాయింపు. టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం. బేడీ ఆంజనేయ స్వామి కవచాలకు బంగారు తాపడం. ఆనంద నిలయం బంగారు తాపడం పనులను ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు తెలిపారు. దీని కోసం ఆగమశాస్ర్తం పండితులలో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే తిరుప్పావడ సేవను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

తిరుమలలో రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం, మే నెలలో రూ.130.29 కోట్లు వచ్చిందని తెలిపిన టీటీడీ, ఆగస్టు 7 న టీటీడీ ఉచిత సాముహిక వివాహాలు

రద్దీ తగ్గేవరకు టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్లు జారీచేయవద్దని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మెన్ వివరించారు. నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. రూ. 2.7 కోట్లతో పార్వేట మండపం కొత్త భవన నిర్మాణం చేపడుతామని తెలిపారు. ఎస్వీ గోశాల ఆవులకు పదినెలలకు సరిపడే రూ. 7.30 కోట్లతో గడ్డిని కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అమరావతి శ్రీవారి ఆలయంలో పూల తోటల పెంపకం, బేడి ఆంజనేయ స్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం, తిరుమల ఎస్వీ పాఠశాలను సింగానియా గ్రూపునకు అప్పగింతకు నిర్ణయం తీసుకున్నారు. స్విమ్స్‌ ఆస్పత్రిలో ఐటీ అభివృద్ధికి రూ. 4.20 కోట్లు కేటాయించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు వివరాలు

- సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.

- సెప్టెంబరు 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

- అక్టోబర్ 1న గరుడ సేవ

- సర్వదర్శనం ప్రతీరోజులాగే కొనసాగుతుంది. స్లాట్ విధానంపై త్వరలోనే నిర్ణయం.