ఈ జన్మలో ఇండిగో విమానం ఎక్కనంటూ కేరళ రాజకీయనేత, అధికార పక్షం ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ శపథం చేశారు. తానే కాదు, తన కుటుంబ సభ్యులు కూడా ఇండిగో విమానాల్లో ప్రయాణించరని అన్నారు. నడిచి ఎంతదూరమైనా వెళతాను కానీ ఇండిగో విమానం మాత్రం ఎక్కబోనని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఇటీవల జయరాజన్ విమానంలో తోటి ప్రయాణికులపై దౌర్జన్యం చేశారంటూ ఇండిగో సంస్థ ఆయనపై 3 వారాల నిషేధం విధించింది.

గత నెల 13న కేరళ సీఎం పినరయి విజయన్ తో కలిసి ఆయన కున్నూర్ నుంచి తిరువనంతపురం వరకు విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు గోల్డ్ స్కాంకు సంబంధించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలిద్దరినీ జయరాజన్ దురుసుగా నెట్టివేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జయరాజన్ చర్యను ఇండిగో ఆక్షేపించింది. విమానంలో నినాదాలు చేసిన ఆ ఇద్దరు కార్యకర్తలపైనా ఇండిగో 2 వారాలు నిషేధం విధించింది. అటు, ఆ ఇద్దరు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)