Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట, భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన అవని లేఖారా, టోక్యోలో ఏడుకు చేరిన భారత్ పతకాల మొత్తం సంఖ్య
Avani Lekhara (Photo Credits: Twitter)

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2020) భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా గోల్డ్‌ మెడల్‌ గోల్డ్‌ మెడల్‌ (Avani Lekhara’s Gold) కైవసం చేసుకుంది. పారాలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత మహిళగా అవని లేఖారా చరిత్ర సృష్టించింది.

పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవని లేఖారాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నిజంగా ఇది భారత క్రీడా రంగానికి స్పెషల్‌ మూమెంట్‌ అని మోదీ ట్వీట్‌ చేశారు. జావిలన్‌త్రో లో దేవేంద్ర ఝజారియా రజతం పతకం సాధించగా, సుందర్‌ సింగ్‌ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. డిస్కస్ త్రోలో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా రజత పతకం సాధించాడు. దీంతో సోమవారం ఒక్కరోజే భారత్‌ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి.

ఇప్పటివరకు పతకాలను సాధించిన వారి వివరాలను చూస్తే.. అవని లేఖారా- గోల్డ్‌ మెడల్‌ (షూటింగ్‌), యోగేశ్ కతునియా- సిల్వర్‌ మెడల్‌(డిస్కస్ త్రో), నిశాద్‌ కుమార్‌- సిల్వర్‌ మెడల్‌(హైజంప్‌), భవీనాబెన్‌ పటేల్‌- సిల్వర్‌ మెడల్‌(టేబుల్‌ టెన్నిస్‌), దేవేంద్ర ఝజారియా- సిల్వర్‌ మెడల్‌(జావిలన్‌త్రో), సుందర్‌ సింగ్‌- కాంస్య పతకం(జావిలన్‌త్రో), వినోద్‌ కూమార్‌- కాంస్య పతకం(డిస్కస్ త్రో). టోక్యోలో పతకాల పంట పండటంతో ట్విట్టర్ వేదికగా అందరూ విజయం సాధించిన వారిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

పారాలింపిక్స్‌లో మరో పతకం, డిస్కస్‌త్రో విభాగంలో కాంస్య పతకం సాధించిన వినోద్‌ కుమార్‌

మెగా క్రీడల్లో ఆరో రోజు అద్భుతం చేసిన ఆటగాడు యోగేశ్‌ కతునియా (Yogesh Kathuniya) అని చెప్పవచ్చు. పురుషుల ఎఫ్‌56 డిస్కస్‌ త్రో పోటీల్లో రజతం కైవసం చేసుకున్నాడు. డిస్క్‌ను ఆరో దఫాలో 44.38 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. యోగేశ్‌ దిల్లీలోని కిరోరిమల్‌ కళాశాలలో బీకామ్‌ చదివాడు. అతడి తండ్రి సైన్యంలో పనిచేస్తున్నారు. కతునియాకు ఎనిమిదేళ్ల వయసులో పక్షవాతం రావడంతో శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయడం లేదు.

ఐతే అతడికి పతకాలు సాధించడం కొత్తేం కాదు. 2019లో దుబాయ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో డిస్క్‌ను 42.51 మీటర్లు విసిరి కాంస్యం గెలిచాడు. ఆ ప్రదర్శతోనే అతడు పారాలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. 2018లో అతడు పోటీపడ్డ తొలి అంతర్జాతీయ పోటీల్లోనే ఎఫ్‌36 విభాగంలో ప్రపంచ రికార్డు సాధించడం గమనార్హం.

దేవేంద్ర జజారియా.. పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. హ్యాట్రిక్‌ పారాలింపిక్స్‌ విజేతగా (Devendra Jhajharia’s Silver Medals) అవతరించాడు. జావెలిన్‌ త్రోలో 2004, 2016లో స్వర్ణ పతకాలు ముద్దాడిన అతడు ఈ సారి రజతం అందుకున్నాడు. ఈటెను 64.35 మీటర్లు విసిరి అత్యుత్తమ వ్యక్తిగత రికార్డునూ నెలకొల్పాడు. ఎనిమిదేళ్ల వయసులో ఓ చెట్టు ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురైన జజారియా అతడి ఎడమచేతిని పోగొట్టుకున్నాడు.

పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, రజతం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్, ఫైనల్లో చైనా క్రీడాకారిణి యింగ్​ ఝో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి

జావెలిన్‌ త్రో లోనే మరో ఆటగాడు సుందర్‌సింగ్‌ గుర్జార్‌ (Sundar Singh’s Bronze ) ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఎఫ్‌46 విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. ఈటెను 64.01 మీటర్లు విసిరి అద్భుతం చేశాడు. దాంతో ఒకే క్రీడాంశంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. 25 ఏళ్ల గుర్జార్‌ 2015లో ప్రమాదానికి గురయ్యాడు. స్నేహితుడి ఇంట్లో ఆడుకుంటుండగా ఓ లోహపు రేకు అతడి ఎడమ చేతిపై పడింది. జైపుర్‌కు చెందిన గుర్జర్‌ 2017, 2019 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు గెలవడం ప్రత్యేకం. ఇక 2018 జకార్తా పారా ఆసియా క్రీడల్లో రజతం ముద్దాడాడు