NZ vs IND 1st ODI: తడబడిన ఇండియా, పుంజుకున్న కివీస్, తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్, సెంచరీతో అదరగొట్టిన రాస్ టేలర్, వన్డే కెరీర్‌లో తొలి సెంచరీతో మెరిసిన శ్రేయస్‌ అయ్యర్‌
Ross Taylor (Photo Credits: Getty Images)

Hamilton, February 5: న్యూజిలాండ్‌ (New Zealand) పర్యటనలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు టీ20 ల సిరీస్‌ను 5-0 తేడాతో గెలిచి అదరహో అనిపించిన భారత్ (India) పరిమిత ఓవర్ల ఆటలో మాత్రం కివీస్‌ ముందు తలవంచింది. హామిల్టన్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో (NZ vs IND 1st ODI) న్యూజిలాండ్‌ టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కొంతకాలంగా తన ఆటతీరుతో విమర్శలపాలవుతున్న కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ (Ross Taylor) చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు.

టేలర్ శతకంతో చెలరేగడంతో న్యూజీలాండ్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విధించిన 348 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో రాస్‌ టేలర్‌ సెంచరీ చేయగా టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోలస్‌లు అర్థసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు, శార్దూల్‌ ఠాకూర్‌ 1 వికెట్‌ తీశాడు. టీమిండియా బౌలర్లలో ఒక్క బుమ్రా తప్ప మిగతవారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

సూపర్ ఓవర్లో మళ్లీ టీమిండియాదే గెలుపు

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీతో మెరవగా, కేఎల్‌ రాహుల్‌ మెరుపు అర్థశతకాన్ని సాధించగా, టీమిండియా కెప్టెన్‌ కోహ్లి అర్థశతకంతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌధీ 2 వెకెట్లు, కొలిన్‌ డి ఇంగ్రామ్‌, ఇష్‌ సోదీ చెరో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం(ఫిబ్రవరి 7) ఆక్లాండ్‌ వేదికగా జరగనుంది.