Students Ill After Midday Meal: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్, 85 మంది విద్యార్ధులకు తీవ్ర అస్వస్థత, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కలకలం, పాడైన గుడ్లు తినడం వల్లనే అస్వస్థతకు గురయ్యారంటూ తల్లిదండ్రుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం (Midday Meal) వికటించి 85 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కర్నూలు (Kurnool), అనంతపురం (Ananthapur) జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల, అనంతపురం జిల్లా పిల్లిగుండ్ల కాలనీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి
Kurnool, March 11: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం (Midday Meal) వికటించి 85 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కర్నూలు (Kurnool), అనంతపురం (Ananthapur) జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల, అనంతపురం జిల్లా పిల్లిగుండ్ల కాలనీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (Govt. School) ఈ ఘటన జరిగింది. ఈ స్కూల్ లో మధ్యాహ్నం విద్యార్ధులకు పొంగలి, పప్పు, సాంబారు, గుడ్లు విద్యార్థులకు వడ్డించారు. తిన్న కొద్దిసేపటికి 45 మంది విద్యార్థులు వాంతులు(Vomits), విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే వారిని నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ విజయ్కుమార్ పర్యవేక్షణలో విద్యార్థులకు చికిత్స అందించారు. పాడైన గుడ్లు(Spoiled Eggs) వండిపెట్టడం వల్లే అవి తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పిల్లలకు అందించిన గుడ్లను కాంట్రాక్టర్ రవి ఈ నెల 3వ తేదీన సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మామాలుగా గుడ్లు 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అయితే ఇవి చాలా రోజుల నుండి నిల్వ ఉంచినవి కావడంతో వాసన వస్తున్నాయని, పిల్లలు ఆ గుడ్లను తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోసిస్తున్నారు. పాఠశాల ఆవరణలో వండటానికి స్థలం లేనందున వంట మనిషి ప్రతి రోజు ఇంటి వద్ద వండి తీసుకువస్తోందని, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్పాయిజన్ (Food Poison) అయ్యిందని తెలిసిన ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి (Shilpa Ravi) అసెంబ్లి సమావేశంలో ఉండటంతో సూపరింటెండెంట్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అస్వస్థులైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఆరోగ్య పరిస్థితిని ప్రస్తుతం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను భూమా బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. అటు విద్యార్ధులను మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ (Bhuma Akhila priya) పరామర్శించారు. తమకు పాడైపోయిన గుడ్లను అందించడం వల్లనే అస్వస్థతకు గురయ్యామని విద్యార్ధులు ఆమె చెప్పారు.దీనిపై స్పందించిన అఖిలప్రియ ఆసుపత్రి ఆవరణలో నిందితులను శిక్షించాలని నేలపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఘటనకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవా లన్నారు. కలెక్టర్ వచ్చి సంఘటనపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు అనంతపురం రూరల్ (Ananthpur Rural) పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం విద్యార్థులకు పొంగలి, సాంబారు వడ్డించారు. తిన్న వెంటనే 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో, కొంతమంది పిల్లలు సొమ్మసిల్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన పాఠశాల వద్దకు వచ్చి 108 వాహనాల ద్వారా చికిత్సకోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ ఆస్పత్రికి చేరుకొని వైద్య సేవలు అందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఇతర అధికారులు సైతం ఆస్పత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్న భోజనం పంపిణీలో వైఫల్యానికి బాధ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స కోసం పిల్లలు చేరిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో పరుగు పెడుతూ ఆస్పత్రికి వచ్చారు. కన్నీరుమున్నీరుగా కొందరు విలపించారు. భోజన ఏజెన్సీ నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
(The above story first appeared on LatestLY on Mar 11, 2022 11:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

