Aarogya Suraksha: ఏపీ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమం, అందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.
Vjy, Sep 29: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములేనన్నారు. 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు.
‘‘ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటాం’’ అని సీఎం స్పష్టం చేశారు.ప్రతి పీహెచ్సీ పరిధిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే ఇంకో డాక్టర్ అంబులెన్స్లో గ్రామాల్లోకి వెళ్తారు’’ అని సీఎం జగన్ తెలిపారు.
‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రాథమిక పరీక్షలతో ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు, పీహెచ్సీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ద్వారా చికిత్సలు, మందులను ఉచితంగా అందించబోతోంది.ఎవరైనా రోగులకు అవసరమైతే ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి వైద్య చికిత్సలు చేయించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, వైఎస్సార్ అర్బన్ క్లీనిక్ల పరిధిలోని గృహాలను ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్ఓలు) సందర్శిస్తారు.
ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితాలను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు ఇస్తారు. ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండలంలోనూ ఏదో ఒక వైఎస్సార్ విలేజ్ క్లీనిక్తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు.
నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేస్తారు.
(The above story first appeared on LatestLY on Sep 29, 2023 09:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

