Amaravati, August 07: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి రోజురోజుకి మరింత పెరుగుతూ పోతుంది. ప్రతిరోజు వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇటీవల కాలంగా ఏపీ, మహారాష్ట్రతో పోటీపడుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 2 లక్షలు దాటేసింది.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 2,04,065 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇక రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా రోజురోజుకుపెరుగుతూ పోతుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఒక్కరోజులో మరో 89 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 1842 కు పెరిగింది.
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 1331 కేసులు నమోదయ్యాయి. అలాగే , తూర్పు గోదావరి జిల్లా నుంచి 1270 కేసులు మరియు అనంతపూర్ జిల్లా నుంచి 1100 పాజిటివ్ కేసుల చొప్పున నమోదయ్యాయి.
AP's COVID19 Report:
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,594 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 1,20,464 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 84,654 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
గడిచిన ఒక్కరోజులో 62,938 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు సుమారుగా 23,62,270 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.