Andhra Pradesh Floods: మృతి చెందిన కండక్టర్‌ కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం, రాజంపేట దుర్ఘటన దురదృష్టకరమని తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
APSRTC Managing Director Dwaraka Tirumala Rao (Photo-Video Grab)

Amaravati, Nov 20: కడప జిల్లా రాజంపేట మండలంలో వరద నీటిలో (Andhra Pradesh Floods) చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (APSRTC Managing Director Dwaraka Tirumala Rao ) సంస్థ తరుఫున రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రాజంపేట వరదలో మూడు బస్సులు చిక్కుకు పోగా వాటిలో రెండు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. ఒక బస్సులోని కండక్టర్‌తో పాటు మరో ముగ్గురు మృతి (Died in Floods) చెందారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ శనివారం కడప జిల్లాలో పర్యటించి బస్టాండ్‌, గ్యారేజ్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఏపీ మొత్తం 1800 బస్సు సర్వీసులను రద్దు చేశామని వెల్లడించారు. రాజంపేట దుర్ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కండక్టర్‌ కుటుంబంతో పాటు ప్రయాణికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన వెల్లడించారు. మరో ఇద్దరు ప్రయాణికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేస్తామన్నారు.

గంగమ్మ ఉగ్రరూపం, వణుకుతున్న మూడు జిల్లాలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే

కడప ఆర్టీసీ గ్యారేజ్‌కు రూ.10కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఇవాళ సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

కడప జిల్లా నందలూరు దగ్గర ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్న ఘటనలో 12మంది మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 50మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో గండ్లూరులో 7, రాయవరంలో 3, మండపల్లిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో చిక్కుకున్న పలువురిని రెస్క్యూ టీమ్స్ రక్షించగా గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాగులో చిక్కుకున్న బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు.

గల్లంతయిన వారికోసం గాలింపు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు పంపిన సీఎం మరణించిన వారికి పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గల్లంతయిన వారి విషయంలో రేపటికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుండగా ఎక్స్‌గ్రేషియాను మరింత పెంచేందుకు కృషి చేస్తామని రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు.