APPSC 2021: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో అన్ని ఇంటర్వ్యూలు రద్దు, ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపిన ప్ర‌భుత్వం, ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ
AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, June 26: పోటీ పరీక్షల ఇంటర్యూల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు ( Andhra Pradesh Govt Cancels Interviews for APPSC Exams) చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు (Group - 1, Interviews cancelled in APPSC recruitment) చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇకపై ఏపీలో పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడించింది. కాగా ఏపీపీఎస్సీ నిర్వ‌హిస్తోన్న ఉద్యోగ నియామకాల రాత‌ప‌రీక్ష‌ల స‌మ‌యంలో విద్యార్థుల్లో ఒత్తిడిని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు సమాచారం. ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్‌-1 స‌హా అన్ని కేట‌గిరీ పోస్టుల‌కూ ఇంట‌ర్వ్యూల నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు, సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు

ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క్రియ విష‌యంలో పూర్తి పారద‌ర్శ‌క‌తతో వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే పోటీ ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు తొల‌గించాల‌ని చాలా కాలంగా డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే

ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ శనివారం(నేటి) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌/ఈఏపీసెట్‌’ను సందర్శించాలి.

కోర్సులు..

1.ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌అగ్రి ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

2.బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్‌), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎఫ్‌ఎస్సీ

3.బీఫార్మసీ, ఫార్మాడీ

దరఖాస్తుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు..

► ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500

► అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500

► రెండింటికీ కలిపి హాజరయ్యేవారికి.. ఓసీలకు రూ.1,200, బీసీలకు రూ.1,100, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000

ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు..

► ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు

► ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5 వరకు, రూ.1000తో ఆగస్టు 10 వరకు, రూ.5 వేలతో ఆగస్టు 16 వరకు, రూ.10 వేలతో ఆగస్టు 18 వరకు

► హాల్‌ టికెట్లను ఆగస్టు 12 నుంచి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆగస్టు 19 నుంచి పరీక్షలు

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.

► ఉదయం సెషన్‌ 9 నుంచి 12 గంటల వరకు

► మధ్యాహ్నం సెషన్‌ 3 నుంచి 6 గంటల వరకు