Oxygen Plants in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆక్సిజన్ ఫ్లాంట్ల ఏర్పాటుకు రూ.309.87 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు, రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు
Oxygen cylinders | representational Image (Photo Credits: PTI)

Amaravati, May 9: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు (Oxygen Production Plants in AP) ఆంధ్రప్రదేశ​ ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ (huge funds setting oxygen production plants) వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. 10 వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల ఏర్పాటు చేయనుంది.

ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు రూ.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కోవిడ్‌ వైద్యానికి ఆక్సిజన్‌ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాపై కరికాల వలవన్‌ దృష్టిసారించనున్నారు.

అత్యవసర ప్రయాణికులకు ఊరట, రేపటి నుంచి ఏపీలో ఈ-పాస్‌ విధానం అందుబాటులోకి, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు, విజయవాడలో డీజీపీ గౌతం సవాంగ్ ఆకస్మిక పర్యటన

కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా చాలా కీలకమైనందున.. దీన్ని సమర్థంగా నిర్వహించడం కోసం ఇప్పటికే 9 మంది సభ్యులతో మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆక్సిజన్‌ ఎంత కావాలి? భవిష్యత్‌ అవసరాలకు ఎంత అవసరం.. అనే అంశాలను పరిశీలించడంతో పాటు.. ఎలాంటి అంతరాయం లేకుండా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ పేర్కొన్నారు.

విజయవాడకు చేరుకున్న 3లక్షల 60 వేల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు, 9 మందితో ఆక్సిజన్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

ఐఏఎస్‌ అధికారులు ఢిల్లీ రావు, రాజాబాబుతో పాటు పరిశ్రమలశాఖకు చెందిన డీడీ ఎం.సుధాకర్‌బాబు, ముగ్గురు కన్సల్టెంట్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌రెడ్డి, రవాణా శాఖ నుంచి ఆర్టీఏ పుమేంద్ర, ఎంవీఐ ప్రవీణ్‌లతో ఈ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి షాన్‌ మోహన్‌కు వీరంతా రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.