
Amalapuram, June 2: కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ జిల్లాగాపేరు మార్చడంపై అల్లర్లు (Amalapuram Riots Case) చెలరేగిన సంగతి విదితమే. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 20 మంది నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ (Police arrests 20 more accused) చేశారు. దీంతో మొత్తం అరెస్ట్లు 91కి చేరుకున్నాయి.
నిందితుల ఒప్పుకోలు, సహ నిందితుల వాంగ్మూలం, వీడియోలు, సిసి టివి పుటేజ్, టవర్ లొకేషన్, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.
అమలాపురంలో 144 సెక్షన్, పోలీసు చట్టం 30 అమల్లో ( continue section 144) ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో జాతీయ నాయకులను కించపరిచేలా పోస్టులు పెట్టవద్దని..పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు. గత నెల 24న జరిగిన విధ్వంసంలో మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసం, మూడు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి.
అమలాపురంలోని శుభకలశం మొదలుకొని గడియార స్తంభం నల్ల వంతెన, కలెక్టరేట్ ఎర్ర వంతెన, మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాస దగ్ధం వరకు పాల్గొన్న ఆందోళనకారులపై పోలీసులు.. సాంకేతిక సహకారంతో దర్యాప్తు చేస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 7 బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
ప్రస్తుతం అమలాపురం పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పోలీసులు.. తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. పట్టణంలోకి వస్తున్న వారికి అన్ని రకాల ప్రశ్నలు అడిగి.. సంతృప్తి చెందితే అమలాపురంలోకి అనుమతిస్తున్నారు. అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లాలో నిలిచిన ఇంటర్నెట్ సేవలను 9 రోజుల తర్వాత అమలాపురం మినహా ఇతర ప్రాంతాల్లో క్రమక్రమంగా పునురుద్ధరిస్తున్నారు.