
Nellore, Feb 3: వైసీపీపై తిరుగుబాటు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (kotam reddy sridhar reddy ) ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి పార్టీపై విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి (Kakani vs Kotamreddy) స్పందించారు. 2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంత పోటీ ఉందనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుసని, ఆనాడు జగన్మోహన్రెడ్డి స్థానంలో ఎవరున్నా కోటంరెడ్డికి సీటు దక్కి ఉండేది కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) తెలిపారు.
పార్టీ మారాలనేది కోటంరెడ్డి వ్యక్తిగత విషయం. కానీ, వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం సరికాదు. అక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు, కోటంరెడ్డిని ట్యాప్ చేశారు. చంద్రబాబు ట్రాప్లో పడ్డారు కోటంరెడ్డి. ఒకవేళ నిజంగా ట్యాపింగ్ జరిగి ఉంటే.. అవమానం, అనుమానం అనే బదులు విచారణకు ముందుకు వెళ్లొచ్చు కదా అని కాకాణి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్నిరోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు.. ఏమైంది?. అది ఆడియో రికార్డ్ అని తెలుసు కాబట్టే అవమానించారని డ్రామాలు ఆడుతున్నావు అంటూ కోటంరెడ్డిపై మండిపడ్డారు .
టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే ఆరోపణలు చేస్తున్నావ్. కోటంరెడ్డి నువ్వు వీరవిధేయుడివి కాదు.. వేరే వాళ్లకు విధేయుడివి. సీఎం జగన్ టికెట్ ఇచ్చారు కాబట్టే.. ఎమ్మెల్యే అయ్యావు. ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణం కాదా?. సీఎం జగన్ 1 అయితే.. ఆ ముందు ఉండే సున్నాలం మనం. ఆ ఒక్కటే లేకపోతే.. మనమంతా జీరోలం. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదు. అంతకంటే మంచి నేతలు పార్టీలోకి వస్తారు. కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతోందని కాకాణి జోస్యం పలికారు.