Amaravathi, May 27: ఆంధ్రప్రదేశ్లో సెకండ్ వేవ్ కరోనా అదుపులోకి వస్తుంది. రోజూవారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత వారం రోజుల కేసులను పరిశీలిస్తే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల నుంచే కేసులు అధికంగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏపిలో గత వారం రోజుల్లో పట్టణ ప్రాంతాల నుంచి 39 శాతం కేసులు నమోదు కాగా, మిగతా 61 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనివే అని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఏపిలో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయని పాజిటివ్ రేటు 25 శాతం నుంది 19 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ కట్టడి కోసం ప్రజలందరూ సహకరిస్తూ నిబంధనలు పాటించాలని వారు కోరుతున్నారు.
రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 16,167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 16,43,55కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 16,40,662గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 2,967 కోవిడ్ కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లా నుంచి 2,325, అనంతపూర్ జిల్లా నుంచి 1,472 అలాగే విశాఖ జిల్లా నుంచి 1,434 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 144 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 10,531కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 21,385 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 14,46,244 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,86,782 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.