Amaravathi, June 4: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుండి తాడిపత్రిలోని 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రి సమీపంలో అర్జాస్ స్టీల్ వద్ద 500 పడకల జర్మన్ హ్యాంగర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు కేవలం 15 రోజుల్లోనే రూ. 5.50 కోట్ల వ్యయంతో 13.56 ఎకరాల్లో ఈ కోవిడ్ ఆసుపత్రిని నిర్మించారు.
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ఇప్పటికే చాలావరకు తగ్గుముఖం పట్టింది. రోజురోజుకి కేసులు తగ్గుతూపోతుండగా, అంతకుమించి రికవరీలు నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు కూడా తమేణా తగ్గుతున్నాయి.
రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 85,311 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 10,413 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 17,38,990కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 17,36,095గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 2,075 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 1,574 అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 974 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 83 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 11,296కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 15,469 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 15,93,921 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,33,773 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.